- Home
- Entertainment
- `తండేల్` ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశారు.. ఇక భారమంతా సాయిపల్లవి, నాగచైతన్య మీదనే
`తండేల్` ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశారు.. ఇక భారమంతా సాయిపల్లవి, నాగచైతన్య మీదనే
నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన `తండేల్` మూవీ ట్రైలర్ విడుదలైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? చైతూ, సాయిపల్లవి కెమిస్ట్రీ ఎలా ఉందనేది చూస్తే.

సాయి పల్లవి, నాగచైతన్య మరోసారి జంటగా నటించిన చిత్రం `తండేల్`. ఇప్పటికే వీరిద్దరు `లవ్ స్టోరీ` మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జోడీ కట్టారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన `తండేల్` సినిమాని జీఏ2 బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మించారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ని విడుదల చేశారు.
`రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా’ అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు.
కానీ ఓసారి పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని చైతూ చెప్పే డైలాగ్లు పవర్ఫుల్గా ఉన్నాయి.
నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ట్రైలర్ లో కొంత లవ్ ట్రాక్, మరికొంత యాక్షన్ ఉంది. దీనికితోడు దేశభక్తి కూడా ఉంది. కాకపోతే అంత కిక్ ఇచ్చేలా లేదు. ఆశించిన స్థాయిలో ట్రైలర్ లేదు. ఏదో మిస్సింగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది.
ట్రైలర్ లో హై ఇచ్చే మూమెంట్స్ కనిపించడం లేదు. మరోవైపు ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పినట్టుగా ఉంది. అదే నిజమైతే ఇక తెరపై సాయిపల్లవి, నాగచైతన్య తమ యాక్టింగ్తోనే మ్యాజిక్ చేయాలి. లేదంటే ఫలితం వేరేలా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఎంత వరకు మ్యాజిక్ చేస్తారో చూడాలి.
వైజాగ్లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్స్ ప్యాలెస్లో ఈ ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఇందులో నాగచైతన్య మాట్లాడుతూ, `మన `పుష్ప` కా బాప్ అల్లు అరవింద్. ఏడాదిన్నర నుంచి నా లైఫ్లో నిజమైన తండేల్ ఆయనే. చివరికి వచ్చేసరికి ఆయన లేకుండా ఇంకో సినిమా నేను ఎలా చేయగలను అనే ఫీలింగ్ వచ్చేసింది.
ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఆయన గైడెన్స్ చాలా విలువైనది. నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. వైజాగ్ విషయానికి వస్తే .. ఏ సినిమా రిలీజ్ అయినా వైజాగ్ టాక్ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.
మా ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదే. కాబట్టి మీకో రిక్వెస్ట్.. తండేల్ సినిమాకు వైజాగ్లో కలెక్షన్స్ షేక్ అవ్వాలి. లేదంటే ఇంట్లో నా పరువుపోతుంది(నవ్వుతూ). ఈపాలి యాట తప్పేదేలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే` అని చెప్పారు చైతూ.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, `చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి చాలా బాగా తీశారు. సాయిపల్లవి అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు.
ఈ సినిమాతో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంటారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్రవాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది` అని తెలిపారు.
read more: చిరు, బాలయ్య వల్ల కాలేదు.. వెంకటేష్ పేరుమీదే ఆ మూడు రికార్డులు, ఇప్పటికీ ఆయనే తోపు
also read: `పుష్ప` ఫ్లాప్, సుకుమార్కి ముందే చెప్పిన అల్లు అర్జున్, ఇంతటి సంచలనం వెనుక ఏం జరిగిందంటే?