- Home
- Entertainment
- ఫస్ట్ కోటి నుంచి రూ.1500కోట్ల కలెక్షన్లు రాబట్టిన టాలీవుడ్ మైల్ స్టోన్ మూవీస్ ఇవే.. ఒకే హీరో మూడు రికార్డులు
ఫస్ట్ కోటి నుంచి రూ.1500కోట్ల కలెక్షన్లు రాబట్టిన టాలీవుడ్ మైల్ స్టోన్ మూవీస్ ఇవే.. ఒకే హీరో మూడు రికార్డులు
Tollywood Milestone Films: తెలుగులో మొదటిసారి కోటి రూపాయలు కలెక్షన్లు సాధించిన చిత్రాల నుంచి రూ.1500కోట్లు సాధించిన చిత్రాల వరకు టాలీవుడ్లో కలెక్షన్ల పరంగా మైల్ స్టోన్ చిత్రాలేంటో చూద్దాం.

ఫస్ట్ కోటి వసూలు చేసిన మూవీ -మయాబజార్
తెలుగులో మొదటిసారి కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టిన చిత్రం `మాయా బజార్`. ఈ మైథలాజికల్ ఫిల్మ్ కి కేవీ రెడ్డి దర్శకుడు. దీన్ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్ వంటి భారీ తారాగణం నటించింది. ఈ చిత్రం 1957 మార్చి 27న విడుదలైంది. సంచలన విజయం సాధించింది. అప్పట్లో కోటి కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు రెండు మూడు వేల కోట్లకు సమానంగా చెప్పొచ్చు.
ఫస్ట్ రూ.10కోట్ల మూవీ-జగదేక వీరుడు అతిలోక సుందరి
తెలుగులో మొదటిసారి పది కోట్లు రాబట్టిన చిత్రం `జగదేక వీరుడు అతిలోక సుందరి`. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించారు. ఫాంటసీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించారు. 1990 మే 9న విడుదలైంది. తెలుగు సినిమా లెక్కలన్నీ మార్చేసింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రం రెండు కోట్లతో రూపొంది, ఏకంగా పది కోట్లు రాబట్టింది. టాలీవుడ్లో ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఓవరాల్గా ఇది రూ.15కోట్లు రాబట్టింది.
ఫస్ట్ రూ.25కోట్ల మూవీ-సమరసింహారెడ్డి
తెలుగులో మొదటిసారి రూ.25కోట్లు రాబట్టిన చిత్రం `సమరసింహారెడ్డి`. బాలకృష్ణ, అంజలా జవేరీ, సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యాక్షన్ బేస్డ్ మూవీ 1999 సంక్రాంతికి విడుదలైంది. సంచలనం విజయం సాధించింది. బాలయ్యని తిరుగులేని సూపర్ స్టార్ని చేసింది. దీనికి బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఇది ఫైనల్గా రూ.30కోట్లు వసూలు చేసింది.
ఫస్ట్ రూ.50కోట్ల సినిమా-పోకిరి
తెలుగులో యాభై కోట్ల మైల్ స్టోన్ని టచ్ చేసిన తొలి చిత్రం `పోకిరి`. మహేష్ బాబు, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2006 ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీసుని షేక్ చేసింది. టాలీవుడ్కి కలెక్షన్ల టేస్ట్ ఏంటో పరిచయం చేసింది. ఈ సినిమా టోటల్గా రూ.70కోట్ల గ్రాస్ని రాబట్టింది.
ఫస్ట్ రూ.100కోట్ల సినిమా-మగధీర
టాలీవుడ్లో మొదటిసారి వంద కోట్లు రాబట్టిన చిత్రం `మగధీర`. రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. శ్రీహరి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 2009 జులై 31న విడుదలైంది. ఇది ఒకేసారి రెండు రికార్డులు క్రియేట్ చేసింది. వంద కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. అదే సమయంలో రూ.150కోట్ల మైల్ స్టోన్ని టచ్ చేసిన మొదటి సినిమాగానూ నిలిచింది.
ఫస్ట్ రూ.500కోట్ల సినిమా-బాహుబలి
తెలుగులో మొదటిసారి రూ.500కోట్లు సాధించిన చిత్రం `బాహుబలి`. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. రాజమౌళి దర్శకుడు. ఈ చిత్రం 2015 జులై 10న విడుదలైంది. ఇది మొదటి సారి ఐదు వందల కోట్లు రాబట్టిన చిత్రంగా అరుదైన మైల్ స్టోన్ని టచ్ చేసింది. ఓవరాల్గా ఇది రూ.650కోట్లు రాబట్టింది.
ఫస్ట్ రూ.1000-రూ.1500కోట్ల మూవీ - బాహుబలి 2
ఇక తెలుగులో వెయ్యి కోట్ల సినిమా `బాహుబలి 2`. `బాహుబలి`కి పార్ట్ 2గా ఈ చిత్రం 2017లో(ఏప్రిల్ 28న) విడుదలైంది. ఇది ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఒకే సారి రెండు మైల్ స్టోన్స్ ని టచ్ చేసింది. వెయ్యి కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది. తెలుగులోనే కాదు, ఇండియాలోనూ వెయ్యి కోట్లు సాధించిన తొలి చిత్రమిదే. అంతేకాదు రూ.1500కోట్ల మైల్ స్టోన్ని టచ్ చేసిన చిత్రం కూడా ఇదే. `బాహుబలి 2` టోటల్గా రూ. 1810కోట్లు రాబట్టింది. ఈ సినిమాలన్నీ తెలుగులో మైల్ స్టోన్ చిత్రాలుగా నిలిచాయి. ఇందులో మూడు రికార్డులు ప్రభాస్ పేరుతోనే ఉన్నాయి. మరి రెండు వేల కోట్ల మైల్ స్టోన్ని టచ్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి.

