హీరోయిన్ల రెమ్యూనరేషన్లో ఎందుకంత రచ్చః బాలీవుడ్పై తాప్సీ బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్పై `పింక్` బ్యూటీ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకి సంబంధించిన రెమ్యూనరేషన్ విషయంలో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ లేపిన నేపథ్యంలో తాప్సీ ఘాటుగా స్పందించింది. బోల్డ్ కామెంట్స్ చేసింది.
చిత్రపరిశ్రమలో పారితోషికం విషయంలో హీరో, హీరోయిన్ల మధ్య తేడా ఉంటుంది. ఓ స్టార్ హీరోకి 50కోట్లకుపైగా రెమ్యూనరేషన్ ఇస్తుంటే, అందులో 10శాతం కూడా హీరోయిన్లకి ఉండటం లేదనే కామెంట్ తరచూ వినిపిస్తుంటుంది. తాజాగా తాప్సీ ఇదే విషయాన్ని లేవనెత్తింది.
తాప్సీ ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించింది. ఇటీవల `సీత` పాత్ర కోసం కరీనా కపూర్ రూ.12కోట్లు డిమాండ్ చేసిందని బాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చర్చనీయాంశంగానూ మారింది. దీనిపై తాప్సీ మాట్లాడారు.
బాలీవుడ్లో నటుల(హీరో, హీరోయిన్లు) మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయని ఆమె వాపోయింది. అది ముఖ్యంగా పారితోషికం విషయంలో మరీ స్పష్టంగా కనిపిస్తుందని ఆమె అసహనం వ్యక్తం చేసింది.
`ఇండస్ట్రీలో ఎవరైనా మహిళా నటులు పారితోషికం ఎక్కువగా అడిగితే అది పెద్ద సమస్యగా మారిపోతుంది. అదే.. ఎవరైనా హీరో రెమ్యునరేషన్ పెంచితే మాత్రం అది అతని సక్సెస్గా చెబుతుంటారు. నాతో పాటు సినిమా కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఇప్పుడు నాకంటే 3-4రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. గుర్తింపు విషయంలోనూ అదే తీరు.
హీరోలకు స్టార్డమ్ వచ్చినంతగా హీరోయిన్లకు గుర్తింపు రావడం లేదు. ఈ వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రేక్షకులు కూడా పురుష నటులతో పోలిస్తే మహిళా నటులను తక్కువగానే అభిమానిస్తారు.
ఇప్పటికీ మేం బడ్జెట్ విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు ఎక్కువగా బడ్జెట్ పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలతో పోల్చితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు రాబడి తక్కువగా ఉంటుందని వాళ్ల భావన. వీటన్నింటికీ ప్రేక్షకులే ప్రధాన కారణం` అని తెలిపింది.
తెలుగులో `ఝుమ్మందినాదం` చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన తాప్సీ దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. `పింక్` సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలకే పరిమితమవుతోంది.
తాప్సీ ప్రస్తుతం నటించిన `హసీన్ దిల్రుబా` నెట్ఫ్లిక్స్లో ప్రసారమవుతోంది. దీంతోపాటు క్రీడా నేపథ్యంలో సాగే రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా `శెభాష్ మిథూ`, స్ప్రింటర్ రష్మి బయోపిక్గా `రష్మి రాకెట్` సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.