- Home
- Entertainment
- Surekha Konidela: చిరంజీవి భార్యకు తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్, బోర్డు మెంబర్ గా సురేఖ కొణిదెల
Surekha Konidela: చిరంజీవి భార్యకు తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్, బోర్డు మెంబర్ గా సురేఖ కొణిదెల
Surekha Konidela: మెగాస్టార్ చిరంజీవి ధర్మపత్ని.. సురేఖ కొణిదెలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌవరం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఆమెను యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు మెంబర్ గా నియమించింది.

యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త పాలక మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నూతన బోర్డుకు ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్గా నియమించారు. చైర్మన్తో పాటు సభ్యులు, ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 మందితో ఈ బోర్డు ఏర్పాటు చేశారు.
బోర్డు మెంబర్ గా సురేఖ కొణిదెల
ఈ నూతన బోర్డులో మెగా కుటుంబానికి అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెలకు సభ్యురాలిగా చోటు కల్పించడం అందరిని ఆశ్చర్చపరిచింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి అయిన సురేఖ కొణిదెల పేరును సభ్యుల జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, సురేఖ కొణిదెల, చిలప్పగారి విజయరాజం, తుల్ల విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, కంటమాని స్వాతి, ఎం. రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్ (ది ఫౌండర్ ట్రస్టీ)లకు అవకాశం కల్పించారు.
తిరుమల తరహాలో పనిచేయనున్న పాలకమండలి..
అలాగే బోర్డులో ఎక్స్-అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రధాన అర్చకులకు స్థానం కల్పించారు.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి, ఆలయ పరిపాలన, భక్తులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై ఈ కొత్త పాలక మండలి బాధ్యతలు నిర్వహించనుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో నూతన బోర్డు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది.

