డబ్బు కోసమే అలాంటి పాత్రలు చేశా..ఆర్థిక కష్టాలు పంచుకుంటూ మహేష్ హీరోయిన్ ఎమోషనల్
తెలుగులో టాప్ హీరోలందరితోనూ జోడీ కట్టిన సోనాలి బింద్రే.. తన ఆర్థిక ఇబ్బందులను పంచుకుంది. తాను డబ్బుకోసమే కొన్ని పాత్రలు చేయాల్సి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది.

తెలుగులో నటించింది ఆరు సినిమాలే అయినా గుర్తిండిపోయే సినిమాలు చేసింది సోనాలి బింద్రే. మహేష్ నటించిన బ్లాక్బస్టర్ `మురారి` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీకాంత్తో `ఖడ్గం`, చిరంజీవితో `ఇంద్ర`, `శంకర్ దాదా ఎంబీబీఎస్`, నాగార్జునతో `మన్మథుడు`, బాలయ్యతో `పల్నాటి బ్రహ్మానాయుడు` చిత్రాలు చేసింది. ఒక్క సినిమా తప్ప అన్నీ సూపర్ హిట్లే.
నటించిన తక్కువ సినిమాలే అయినా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్లో మంచి ఇంపాక్ట్ ని ఏర్పర్చుకుంది. 2002లో మ్యారేజ్ చేసుకున్నాక సినిమాలు మానేసిన సోనాలి బింద్రే మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య కాన్సర్తో పోరాడిన ఆమె, మహమ్మారిని ధైర్యంగా పోరాడి గెలిచింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రి ఇస్తూ ఓ వెబ్ సిరీస్ చేసింది.
`ది బ్రోకెన్ న్యూస్` పేరుతో ఆమె నటించిన వెబ్ సిరీస్ జూన్ 10న విడుదల కాబోతుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో పాల్గొంది సోనాలి. ఇందులో ఆమె ఎమోషనల్ కామెంట్ చేశారు. డబ్బు కోసం కొన్ని రకాల పాత్రలు చేసినట్టు తెలిపింది. ఆర్థిక ఇబ్బందులతో తాను చాలా ఇబ్బంది పడినట్టు తెలిపింది. మనీ కోసమే మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నట్టు పేర్కొంది సోనాలి.
ఒకానొక సమయంలో తనకు చాలా డబ్బులు అవసరమయ్యాయని, హౌజ్ రెంట్ కట్టాలని, బిల్లులు చెల్లించాలని, ఆ సమయంలో తమ ఫ్యామిలీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పింది. `అందుకే నాకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేసుకుంటూ పోయాను. అది ఎలాంటి పాత్ర అనే ఆలోచించకుండానే చేశాను. ఓ సినిమా చేసి ఇంకో సినిమాకు రెడీ అయ్యే సమయానికి అసలు ఎందుకా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను? అని ఆలోచించేదాన్ని` అని చెప్పింది సోనాలి బింద్రే.
` ఆ వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ డబ్బులు ఎప్పుడిస్తారో అని ఎదురుచూసేదాన్ని. అందుకే అతిగా ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేసుకుంటూ పోయాను. ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు' అని చెప్పింది. అంతేకాదు తనకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేడని, ఉండి ఉంటే బాగుండేదని తెలిపింది. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడానికి కూడా డబ్బునే కారణమని, ఆర్థిక ఇబ్బందులు కారణంగా మళ్లీ నటిస్తున్నట్టు తెలిపింది సోనాలి బింద్రే.
ఇదిలా ఉంటే సోనాలి బింద్రే మళ్లీ తెలుగులో నటిస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి. ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో రాబోతున్న `ఎన్టీఆర్ 30`లో కీలక పాత్రలో సోనాలి నటించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇటీవల దీనిపై క్లారిటీ ఇచ్చింది సోనాలి. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. అవి కేవలం రూమర్సే అని పేర్కొంది.