‘సిరివెన్నెల’ పాటలు రాసిన ఆ సినిమా థియేటర్పై దాడి... ప్రాణభయంతో దాక్కున్న దర్శకుడు...
తెలుగు గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పాటల ప్రస్థానంలో ఎలాంటి వివాదాలు లేవు. మానవీయ విలువలకు పెద్దపీట వేస్తూ, సోమరితనాన్ని, చేతకాని తనాన్ని ప్రశ్నిస్తూ సాగే సీతారామశాస్త్రి పాటలు, జనాలను ఉత్తేజపరిచేలా ఉండేవే కానీ, ఎవరి మనోభావాలను దెబ్బతీసేవి కావు. అయితే ఆయన పాటలు రాసిన ఓ సినిమా విడుదల సమయంలో మాత్రం పెను దుమారం రేగింది...
దర్శకుడు కృష్ణవంశీ సినీ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది ‘ఖడ్గం’. దేశభక్తిని నరనరాల నింపేలా రూపొందించిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి...
ముఖ్యంగా పాతబస్తీ ఏరియాలో ఉండే ముస్లింలను తీవ్రవాదులుగా, టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చేవారిలా చూపించిన సన్నివేశాలపై ముస్లిం మతస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు...
‘ఖడ్గం’ సినిమా సమయంలో కృష్ణవంశీ నా దగ్గరికి వచ్చి, దేశాన్ని ‘ఖడ్గం’గా భావించి, ఓ పాట రాయాలని అడిగాడు. నేను ఆశ్చర్యపోయా. దేశాన్ని కత్తి అనుకోవాలా, పాట రాయాలా? అని నవ్వేశా...
అయితే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ‘ఓంకార నాదంతో అంకురించిన వేదధాత్రికి సంకేతం ఈ ఖడ్గం అంటూ పాట రాశా. సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లపై వందలాది ముస్లింలు దాడి చేశారు.
ముస్లింలకు టెర్రరిస్టులుగా చూపించారని, మమ్మల్ని, మా వాళ్ల అలా కించపరుస్తారా? అని సినిమా చూడకుండానే, అందులో ఏముందో తెలియకుండానే థియేటర్లపై దాడి చేసి, ధ్వంసం చేయడానికి వచ్చారు...
ఈ సినిమాలో ఎక్కడా అన్యమతాన్ని కించపరిచే విధంగా ఒక్క పదం కూడా లేదు. అదీకాకుండా ముగ్గురు హీరోల్లో ఒకరు ముస్లిం మతస్తుడు కూడా. అది కూడా తెలుసుకోకుండా ఆ థియేటర్ని బద్ధలుకొట్టడానికి 20-30 మంది థియేటర్ దగ్గరికి వచ్చారు.
ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రాణభయంతో దర్శకుడు కృష్ణవంశీ వారం పాటు అండర్గ్రౌండ్కి వెళ్లిపోయారు. ముస్లింలు థియేటర్పై దాడి చేస్తున్నప్పుడు, అప్పుడు అక్కడి నుంచి ఓ 500 మందికి పైగా ఉన్న అయ్యప్ప స్వాముల బృందం వెళ్తోంది...
అందరూ ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ స్వామిని స్మరించుకుంటూ వెళ్తున్నారు, కానీ అంతమందిలో ఒక్కరు కూడా థియేటర్లో ఏం జరుగుతోంది, వీళ్లు ఎందుకు దాడి చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోలేదు...
చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని గుడ్డి భక్తి ఎందుకు పనికి రాదు. మూఢ భక్తి వల్ల ఒరిగేదీ ఉండదు...’ అంటూ కొన్నిరోజుల కిందట జరిగిన ‘నేషనలిస్ట్ హబ్ కంక్లూవ్-2021’కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో బయటపెట్టారు సిరివెన్నెల సీతారామశాస్త్రి...