ఆ అదృష్టం లేకుండా చేసిన దేవుణ్ణి నిందిస్తూనే ఉంటా... సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్!
సింగర్ సునీత లెజెండ్ ఎస్పీ బాలును తలచుకుని ఎమోషనల్ అయ్యారు. నేడు ఆయన జయంతి నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
జూన్ 4 ఎస్పీ బాలసుబ్రమణ్యం పుట్టినరోజు. ఈ సందర్భంగా సింగర్ సునీత ఆయన్ని తలచుకున్నారు. ఎస్పీ బాలు దూరమైనందుకు ఒకింత వేదన చెందారు. సింగర్ సునీత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.
Singer Sunitha
సింగర్ బాలుతో సునీతకు విడదీయరాని అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి పాడుతా తీయగా షో ఏళ్ల తరబడి చేశారు. విదేశాల్లో పదుల సంఖ్యలో మ్యూజిక్ లైవ్ షోలు ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం టీమ్ లో కచ్చితంగా సునీత ఉండేవారు. ఆయనతో కలిసి వందల పాటలు సునీత పాడారు. ప్రొఫెషన్ కి మించి కుటుంబ సభ్యులు మాదిరి సునీత, ఎస్పీ బాలు మెలిగేవారు. బాలును సునీత మామయ్య అని పిలిచేవారట.
Singer Sunitha
అంతటి సాన్నిహిత్యం ఉన్న గొప్ప మనిషి మరణాన్ని సింగర్ సునీత తట్టుకోలేకపోతున్నారు. ఆయన్ని ఈ లోకం నుండి తీసుకెళ్లిన దేవుడిని కూడా నిందిస్తున్నారు. నిన్న నిజం నేడు జ్ఞాపకం అంటే ఎలా... కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం లేకుండా చేసిన ఆ భగవంతుడిని ఈ రోజు తిడుతూనే ఉంటా.... అని సునీత రాసుకొచ్చారు.
2020 సెప్టెంబర్ 25న ఎస్పీ బాలు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనను కరోనా మహమ్మారి కబళించింది. మైల్డ్ అటాక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రిలో చేరిన బాలు వీడియో విడుదల చేశారు. అవే ఆయన చివరి మాటలు. దాదాపు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించారు.
నెల్లూరుకు చెందిన ఎస్పీ బాలు సంగీత ప్రపంచాన్ని తిరుగులేని రారాజుగా ఏలారు. దశాబ్దాల పాటు ఆయన గాత్రం విరామం లేకుండా వినిపించింది. ఎస్పీ బాలు వివిధ భాషల్లో డెబ్భై వేలకు పైగా పాటలు పాడారని సమాచారం. నేడు ఆయన జయంతి కాగా అభిమానులు స్మరించుకుంటున్నారు.