బాలీవుడ్ బాద్షా బర్త్ డే స్పెషల్.. అభిమానుల నిరాశ..!
బాలీవుడ్ బాద్షాగా పాపులర్ అయిన షారూఖ్ ఖాన్ నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ని శాషించే స్థాయికి ఎదిగిన షారూఖ్ జీవితం స్ఫూర్తిదాయకం. నేడు(సోమవారం) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్పై ఓ లుక్కేద్దాం.
షారూఖ్ 1965లో నవంబర్ 2న ఢిల్లీలోని ఓ ముస్లీం కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి తాజ్ మహమ్మద్ ఖాన్, తల్లి లతీఫ్ ఫాతిమ. షారుఖ్ 15 ఏళ్లున్నప్పుడు తండ్రి క్యాన్సర్ తో మరణించాడు. అతని తల్లి కూడా అనారోగ్యానికి గురై 1990 లో చనిపోయింది. వీరి కుటుంబం బాగా చదువుకున్న ఫ్యామిలీ కావడం విశేషం. దీంతో షారూఖ్ కూడా చదువుల్లో చురుకుగా ఉండేవారు. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించారు. స్కూల్ టైమ్లోనే నాటకాలు వేశారు. ఆ సమయం నుంచి నటనపై ఆసక్తి ఏర్పడింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఫిల్మ్ కోర్స్ చేశారు. మంచి నటనా పరిజ్ఞానంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
టెలివిజన్ ద్వారా కెరీర్ని ప్రారంభించిన షారూఖ్ మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో తిరుగులేని స్టార్గా రాణిస్తున్నారు. ఖాన్ త్రయంలో ఒకరిగా ఆదరణ పొందుతున్నారు. విశేష అభిమాన గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బాలీవుడ్ బాద్షాగా, కింగ్ఖాన్గా పాపులర్ అయిన షారూఖ్ జీవితం నేటి తరానికి ఆదర్శం.
తాను నటించిన తొలి టెలివిజన్ సిరీస్ `ఫౌజీ` విశేష ఆదరణ పొందింది. టీవీ ఆడియెన్స్ కి షారూఖ్ని దగ్గర చేసింది. ఆ తర్వాత వచ్చిన `సర్కస్` సైతం షారూఖ్కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. టీవీ తనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. మొదటిసారి హీరోగా సిల్వర్ స్క్రీన్కి పరిచయం అవుతూ, `దీవానా` చిత్రంలో నటించారు. రాజ్ కన్వార్ దర్శకత్వంలో రిషికపూర్, దివ్య భారతి కీలక పాత్రలు పోషిఇంచిన ఈ సినిమా షారూఖ్ కెరీర్ని మలుపు తిప్పింది.
`బాజిగర్` చిత్రం బాద్ షాకి మంచి బ్రేక్నిచ్చింది. ఇందులో ఆయన నెగటివ్ రోల్ చేయడం విశేషం. హీరోయిజానికి కొత్త అర్థాన్ని చెప్పాడు షారూఖ్. ఇందులో ప్రేమోన్మాదిగా షారూఖ్ నటన విమర్శల ప్రశంసలందుకునేలా చేసింది. `అంజాం` సినిమాలోనూ నెగటివ్ రోల్ చేసి మెప్పించారు. ఇలా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చాడు షారూఖ్.
1995 తర్వాత షారూఖ్ కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది. సల్మాన్ ఖాన్తో కలిసి `కరణ్ అర్జున్` సినిమాలో నటించారు. ఈ మల్టీస్టారర్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో ఆయన రొమాంటిక్ తరహా పాత్రలో అలరించారు. ఈ ఒక్క ఏడాదిలోనే షారూఖ్ ఏడు సినిమాలు చేయడం విశేషం.
ఈ క్రమంలోనే ఆయనకు `దిల్వాలే దుల్హానియా లేజాయెంగే` వంటి ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో పడింది. ప్రేమ కథా చిత్రాలకు ఇది కొత్త అర్థాన్ని చెప్పింది. ఇప్పటికీ ఇది మహారాష్ట్రాలోని మరాఠి మందిర్లో థియేటర్లో ప్రదర్శించబడుతుండటం విశేషం. ఇందులో కాజోల్తో కలిసి ఆయన చేసిన రొమాన్స్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. బ్రహ్మరథం పట్టారు. ప్రేమ కథా చిత్రాల్లో ఇదొక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. `డిల్వాలే దుల్హానియా లేజాయెంగే` చిత్రం విజయంతో టాప్ స్టార్గా ఎదిగిన షారూఖ్కి ఆ తర్వాత ఆ స్థాయి హిట్లు వెంటనే రాలేదు. 1997 లో రిలీజైన `దిల్ తో పాగల్ హై` సినిమాతో మళ్లీ టాప్ రేంజ్ కు చేరాడు ఖాన్.
ఇలా వరుసగా `కుచ్ కుచ్ హోతా హై`, `మొహబ్బతే`, `కల్ హోనా హో`, `స్వదేశ్`, `పరదేశి`, `రబ్ దే బనాది జోడి` వంటి సినిమాలు నటుడిగా షారుఖ్కు మంచి పేరు తీసుకొచ్చాయి. హిస్టారికల్ మూవీ `సమ్రాట్ ఆశోక`, క్రీడాకారులకు స్పూర్తినిచ్చే `చక్ దే ఇండియా` వంటి సినిమాలతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు. షారూఖ్ కెరీర్ని పీక్లోకి తీసుకెళ్ళిన చిత్రం `దేవదాస్`. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో విజువల్ వండర్గా, అద్బుతమైన ప్రేమ గాథ చిత్రంగా రూపొంది బాలీవుడ్ని షేక్ చేసింది. షారూఖ్ని రొమాంటిక్ కింగ్గా మార్చిందీ సినిమా.
`డాన్ సినిమా రీమేక్లో డాన్గా యాక్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. చివరగా ఆయన `జీరో చిత్రంలో నటించారు. ఆ తర్వాత మరే సినిమాని ప్రకటించలేదు. రెండేళ్లుగా ఆయన్నుంచి సినిమా లేకపోవడం అభిమానులను నిరాశకి గురిచేస్తుంది. ఇటీవల `పఠాన్` అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఏషియన్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు షారుఖ్. షారుఖ్ నటనకు ఎన్నో అవార్డులు వచ్చాయి. 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది. 15 ఫిలింఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయి. షారుఖ్ సినిమాలకు ఇంటర్నేషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు 12 సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేశాయి.
ప్రస్తుతం 10 పైగా బ్రాండ్ల యాడ్స్ లో నటిస్తున్నాడు. దీంతోపాటు ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్ టీమ్కి ఓనర్గానూ ఉన్నారు. దీంతోపాటు డ్రీమ్స్ అన్ లిమిటెడ్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి.. తర్వాత రెడ్ చిల్లీస్ ఎంటర్టెయిన్
మెంట్ గా మార్చాడు. దీనిపై తన సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇండస్ట్రీ హిట్స్ తో బాలీవుడ్లో తిరుగులేని స్టార్ ఇమేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న షారూఖ్ తన 55వ పుట్టిన రోజు వేడుకల విషయంలో అభిమానులను నిరాశ పరిచారు. కరోనా ప్రభావం నేపథ్యంలో గుమికూడవద్దని, తక్కువ మందితో, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని తెలిపారు.