నా కూతురికి అన్యాయం చేసింది సల్మానే.. హీరోయిన్ తల్లి ఆవేదన
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మరణం వెనుక ఇండస్ట్రీ పెద్ద కుట్ర ఉందని ఆయన్ను మానసికంగా వేదించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత నటి జియా ఖాన్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ నెల 14న ముంబైలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తన ఆత్మహత్యకు కారణాలను సుశాంత్ తెలపక పోయినా ఇండస్ట్రీలోని రాజకీయాల వల్లే సుశాంత్ ఈ దారుణానికి పాల్పడ్డాడని కొందరు ఇండస్ట్రీ వర్గాలు ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇండస్ట్రీలో నెపోటిజం పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కంగనా రనౌత్ వంటి వారు బహిరంగంగానే విమర్శిస్తుండగా మరికొందరు ఇప్పుడిప్పుడే తమ అనుభవాలను వెళ్లడిస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా సల్మాన్ ఖాన్, కరణ్ జోహర్, ఎక్తా కపూర్ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తాయి. వీరంతా స్టార్ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లేని వారిని ఇబ్బంది పెడుతున్నారని సుశాంత్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో మరో సంచలన విషయం తెర మీదకు వచ్చింది. వివాదాస్పద పరిస్థితిలో ప్రాణాలు విడిచిన నటి జియా ఖాన్ మరణంపై ఆమె తల్లి మరోసారి స్పందించారు. తన కూతురికి న్యాయం జరగకపోవటానికి బాలీవుడ్ పెద్దలే కారణం అంటూ ఆరోపించింది రబియా ఖాన్.
తన కూతురు ఆత్మహత్యకు సంబంధించిన కేసు దర్యాప్తును సల్మాన్ ఖాన్ అడ్డుకున్నాడని చెప్పింది రబియా. సూరజ్ పంచోలిని కాపాడేందుకు సల్మాన్ తన డబ్బును, పరపతిని వినియోగించాడని ఆమె సంచలన ఆరోపణలు చేసింది. 2015లో జియా ఖాన్ ఆత్మహత్య కేసు విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలను వివరిస్తూ ఆమె ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేసింది.
జియా మరణించిన తరువాత సీబీఐ అధికారులు ఫోన్ చేసి తనన లండన్ నుంచి ఇండియాకు పిలిపించారని, కానీ ఇండియాకు వచ్చిన తరువాత సల్మాన్ రోజు ఫోన్ చేసి సూరజ్ మీద చాలా పెట్టుబడి పెట్టాను. అతడిని వేదించవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అంటూ ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చాడని ఆమె చెప్పింది. ఈ విషయం సదరు ఆఫీసరే తనకు చెప్పాడని చెప్పింది రబియా.
బాలీవుడ్ లో జరుగుతున్న ఇలాంటి దారుణాలపై ఇప్పటికైనా చర్చ జరగాలని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా ఆమె సుశాంత్ సింగ్ రాజ్పుత్కు నివాళి అర్పించింది.