`సారంగ దరియా` కూడా ఎత్తిపోతలే..ట్రెండింగే కాదు దారుణంగా ట్రోలింగ్ కూడా..
సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటించిన `లవ్స్టోరి` చిత్రంలోని తాజాగా విడుదలైన `సారంగదరియా` సాంగ్ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ట్రెండ్ అవుతుంది. అయితే ఇది ట్రెండ్ మాత్రమేకాదు దారుణంగా ట్రోల్కి గురవుతుంది. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
సమంత విడుదల చేసిన ఈ తెలంగాణకి చెందిన జానపద గేయమైన `సారంగ దరియా` పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
పాట విడుదల సందర్భంగా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించింది సమంత. మెస్మరైజింగ్ అంటూ పేర్కొంది.
ఇందులో సాయిపల్లవి నిజంగానే మెస్మరైజ్ చేసింది. ఆమె తనదైన డాన్స్ లు, కిర్రాక్పుట్టించే స్టెప్పులతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
ప్రస్తుతం చాలా మ్యూజిక్ లేబుల్స్ లో `సారంగ దరియా` ట్రెండ్ అవుతుందనేది వాస్తవం. ఇది ఓ వైపు అయితే ఇందులో నెగటివ్ కోణం కూడా ఉంది.
అదే సమయంలో ఈ పాటని కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణకి చెందిన ఈ జానపద పాటని రైటర్ ఎత్తి ఈ పాటగా రాశారని అంటున్నారు.
గతంలో మాటీవీలో ప్రసారమయ్యే `రేలా రేలారే.. ` పాటల ప్రోగ్రామ్లో ఓ గాయని ఈ పాటని ఆలపించింది. ఆ సమయంలోనే ఈ పాట దుమ్మురేపింది.
ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు, రచయిత గోరంటి వెంకన్న, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ జడ్జ్ లుగా ఉన్నారు. ఇందులో గాయని అద్భుతంగా ఆలపించింది.
ఇప్పటికే ఉన్న పాటని `లవ్స్టోరి`లో లిరిక్ రైటర్ కాపీ కొట్టారని, దాన్ని పల్లవి యదాతథంగా ఎత్తి, చరణాల్లో మార్పులు చేశారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
అంతేకాదు ఈ సందర్భంగా చిరంజీవి నటించిన `ఠాగూర్` ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. అందులో `నేను సైతం.. `అనే శ్రీ శ్రీ పాటని అదే రైటర్ ఎత్తిపోతల పథకం చేపట్టి జాతీయ అవార్డు కొట్టేసిన విషయం తెలిసిందే.
అయితే సినిమాల్లో కథలు కాపీ కొట్టారని, కాపీరైట్స్ కింద కోర్ట్ కి ఎక్కుతుంటారు. మరి పాటల విషయంలో మాత్రం ఎవరూ స్పందించరు. కథలేగానీ, పాటలకు కాపీరైట్ వర్తించదా అనే వాదన కూడా నెటిజన్ల నుంచి వినిపిస్తుంది.
ఉన్న పాటని కాపీ కొట్టి క్రెడిట్ కొట్టేయడంపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి పాజిటివ్తోపాటు నెగటివ్ కామెంట్లతో కూడా `సారంగ దరియా` ట్రెండ్ అవుతుండటం గమనార్హం.
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన `లవ్స్టోరి` చిత్రం ఏప్రిల్ 16న విడుదలకానుంది. ఈ పాటని మంగ్లీ ఆలపించగా, పవన్ సీహెచ్ సంగీతం అందించారు.