ఉమెన్స్ డే స్పెషల్ః నారిసేనగ్లోబల్ కోసం ఉపాసన, మహిళా సాధికారత కోసం రాశీఖన్నా రన్..
మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు హల్చల్ చేస్తున్నారు. పలు ఈవెంట్లలో పాల్గొని సందడి చేస్తున్నారు. `నారిసేనగ్లోబల్` సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు విస్తరించిన సందర్భంగా మహిళలకు అందించిన అవార్డు ఫంక్షన్లో రామ్చరణ్ భార్య ఉపాసన గెస్ట్ గా సందడి చేయగా, ఉమెన్ ఎంపావర్మెంట్ కోసం రాశీఖన్నా రన్ నిర్వహించారు.
నారిసేన గ్లోబల్ ఎంపావర్స్ ఉమెన్ సంస్థ ఇరవై దేశాలకు విస్తరించింది. ఇందులో ఆరువేల మంది మహిళా సభ్యులున్నారు. ఈ సంస్థ హైదరాబాద్లో అందించిన అవార్డు ఫంక్షన్కి ఉపాసన కొణిదెల గెస్ట్ గా పాల్గొని అవార్డులు అందించారు.
అనేక రంగాల్లో మహిళలు రాణించేలా ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్న నారీసేన గ్లోబల్ సంస్థ పురస్కారాలను మెగా కోడలు, ఎంటర్ ప్రెన్యూర్ ఉపాసన కొణిదెల అందించారు. హైదరాబాద్ హైటెక్స్ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాసనతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అతిథులుగా పాల్గొన్నారు.
వ్యాపారం, వినోదం, విద్య లాంటి వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన నారీమణులను ఈ సందర్భంగా సత్కరించారు. జీవితంలో భయాలను ఎదుర్కొన్నప్పుడే మహిళలు తాము ఎంచుకున్న రంగంలో విజయాలు సాధించగలరని అతిథులు పేర్కొన్నారు.
"నారీసేన గ్లోబల్" సంస్థకు మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో 6 వేల మంది సభ్యులు ఉన్నారు. ఆన్ లైన్ లో వివిధ కోర్సులను నేర్పిస్తూ..మహిళలను సాధికారత దిశగా అడుగులు వేయిస్తోందీ సంస్థ. మహిళలు ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడే సమష్టిగా ఎదగగలరని నిరూపిస్తోందీ నారీసేన గ్లోబల్ సంస్థ.
మరోవైపు హీరోయిన్ రాశీఖన్నా సైతం మహిళా సాధికారత కోసం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం హైటెక్స్ లో రన్ నిర్వహించారు.
జెండా ఊపి ఆమె రన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్ని భాగ్యనగర్ ఫౌండేషన్ నిర్వహించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రేపు సోమవారం(మార్చి 8)న మహిళా దినోత్సవం అనే విషయం తెలిసిందే.