అసలే బాధలో నాని.. పుండుమీద కారంలా ఫేక్ ప్రచారం
కరోనా ప్రభావంతో టాలీవుడ్ దిక్కుతోచని స్థితిలో ఉంది. కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
కరోనా ప్రభావంతో టాలీవుడ్ దిక్కుతోచని స్థితిలో ఉంది. కొన్ని చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. కొందరు ప్రొడ్యూసర్స్ ఒత్తిడి భరించలేక తమ చిత్రాలని రేట్ చూసుకుని ఓటిటి లకు అమ్మేస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి ఏపీలో థియేటర్స్ సమస్య తోడైంది. ఏపీలో టికెట్ ధరలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో చాలా మంది నిర్మాతలు ఓటిటినే సేఫ్ అని భావిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో నాని అటు ప్రొడ్యూసర్స్, ఇటు అభిమానుల నడుమ నలిగిపోతున్నాడు. నాని ఫ్యాన్స్ అంతా తమ హీరో చిత్రాన్ని థియేటర్స్ లోనే చూడాలని కోరుకుంటారు. ఇప్పటికే నాని నటించిన 'వి' చిత్రం ఓటిటిలో రిలీజయింది. ఇప్పుడు టక్ జగదీశ్ కూడా అదే బాటలో నడుస్తుండడంతో తాను క్రాస్ రోడ్స్ లో ఉన్నట్లు నాని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
టక్ జగదీశ్ చిత్రం ఓటిటిలో రిలీజ్ కానుండడంతో ఎగ్జిబిటర్లు కూడా నానినే విమర్శిస్తున్నారు. నాని సినిమాల్లోనే హీరో అని నిజజీవితంలో పిరికివాడు అని తప్పుబడుతున్నారు. ఇక్కడ టక్ జగదీష్ చిత్రంలో నిర్ణయం నిర్మాతలది. అలాంటప్పుడు నానిని విమర్శిస్తే ఎలా అనే వాదన కూడా వినిపిస్తోంది.
నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రం టక్ జగదీశ్ ఓటిటిలో రిలీజ్ అవుతున్న రోజే థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇది ఎగ్జిబిటర్లకు పెద్ద దెబ్బే. కానీ నాని తన తప్పు లేదు అన్నట్లుగా పక్కకు తప్పుకోవడంపై ఎగ్జిబిటర్లు విమర్శిస్తున్నారు.
దీనికి తోడు ఓ ఫేక్ ప్రచారం నానికి తలనొప్పి వ్యవహారంలా మారింది. నాని నటిస్తున్న మరో చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'కి కూడా ఓటిటి డీల్ కుదిరిందని.. ఈ చిత్రాన్ని కూడా త్వరలోనే ఓటిటిలో రిలీజ్ చేయనున్నారు అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ ఈ చిత్రానికి రూ 40 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై స్వయంగా శ్యామ్ సింగ రాయ్ టీం స్పందించాల్సి వచ్చింది. తమ చిత్రంపై వస్తున్న న్యూస్ ఫేక్ అని చిత్ర యూనిట్ తేల్చేసింది. శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.