పాపం ప్రభాస్,పెద్ద చిక్కే వచ్చింది.. ఎలా బయటపడతాడో
కరోనా వైరస్ ప్రభావం షూటింగ్ లా మీద కూడా పడిన విషయం తెలిసిందే. సినిమా, సీరియల్, వెబ్ సిరీస్, ఇతర షూటింగ్ లను నిలిపివేసారు. ఈ నేపధ్యంలో ప్రారంభ దశలో ఉన్న సినిమాలకు పెద్దగా నష్టం లేదు కానీ, ఇప్పటికే మొదలై సగంలో ఉన్న పెద్ద సినిమాలకు పెద్ద సమస్యలే వచ్చి పడుతున్నాయి.
అందులో ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. ఈ సినిమాకు ప్రారంభం నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. మొదట్లో సాహో కోసం ఈ చిత్రం షూటింగ్ ని వాయిదా వేసారు. ఆ తర్వాత స్క్రిప్టు మార్పులని కొద్ది నెలలు వాయిదా పడింది. ప్రభాస్...రెస్ట్ తీసుకుని షూటింగ్ కు వచ్చేసరికి మొత్తం సీనే మారిపోయింది.
ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న ఈ చిత్రానికి రాధే శ్యామ్ అనే టైటిల్ పెట్టారు. ఏ ముహార్తాన్న ఈ సినిమా ప్రారంభం అయ్యిందో కానీ ఈ చిత్రానికి అడుగడుగునా అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా ఎంతో నమ్మి చేసిన సాహో ఫెయిల్ అయిన దగ్గర్నుంచి ఈ చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ మొత్తం మార్చేసి అయిదు నెలల తర్వాత షూటింగ్ మొదలెట్టారు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసిగా ఉన్నారు.
యూరోప్ లోనే ఈ చిత్రాన్ని షూట్ చేద్దామని అనుకుని, రీసెంట్ గా జార్జియా లో షూటింగ్ బెస్ట్ అని అని డిసైడ్ అయి అక్కడికి వెళ్లారు. అయితే కరోనా మొహమాటం లేకుండా వచ్చి వాళ్ళని విదేశాల నుంచి వెనక్కి పంపించింది.
అంతేకాదు పరిస్దితులు చూస్తూంటే...ఇప్పుడిప్పుడే విదేశాల్లో షూటింగ్ చేయడమే సాధ్యమయ్యేలా లేదు. లాక్ డౌన్ పూర్తయినా కానీ విదేశీ యాత్రలకి ఇప్పుడప్పుడే పర్మిషన్ రాకపోవచ్చు అని అర్దమవుతోంది.
మనం వెళ్దామని ఉత్సాహపడినా...ఆ దేశాలు కూడా పరదేశీయులని ఇప్పుడిప్పుడే ఆహ్వానించే పరిస్థితి లేదు. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఎలా పూర్తి చేయాలనే బెంగ ప్రభాస్ టీమ్ కు పట్టుకుందిట.
దర్శకుడు, నిర్మాత కలిసి గత కొద్ది రోజులుగా ఇదే డిస్కషన్ లో ఉన్నారని చెప్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా చిత్రాన్ని ఇక్కడే ఎలా పూర్తి చేయాలనే దానిపై తలలు బాదుకుంటున్నారు.
ఈ సినిమాకు ప్రధాన సమస్య కథ నేపథ్యం. దాన్ని ఇండియాకి మార్చడం బెస్టా లేక సెట్స్ వేయడమా అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు చెప్తున్నారు.
ఇక ఈ సినిమాకు తన ఫ్యాన్స్ కు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ట్రీట్ ఇవ్వాలని అప్పట్లో అనుకున్నారు. అందుకోసం ప్రత్యేకమైన రోజును ఎంచుకున్నారుట. ఆ రోజు మరేదో కాదు ఉగాది. తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన ఉగాది రోజున తన చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి క్రేజ్ క్రియోట్ చేయాలనుకుంటన్నారు. అయితే ఉగాది రోజు అందరూ కరోనా షాక్ లో ఉండటంతో వదిలేసారు.
జిల్ ఫేమ్ రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు.
ఈ సినిమా కోసం ‘జాను’ అనే వర్కింగ్ టైటిల్ చాలా కాలం ప్రచారంలో ఉంది. ఐతే, ఈ టైటిల్ ని సమంత-శర్వా సినిమా కోసం దిల్ రాజు తీసుకోవటంతో ఇప్పుడు రాధే శ్యామ్ అనే టైటిల్ పెడుతున్నారని తెలుస్తోంది.
మరో ప్రక్క ఈ చిత్రానికి ‘ఓ డియర్’ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ ను యూవీ క్రియేషన్స్ ఫిల్మ్ ఛాంబర్లో రిజస్టర్ కూడా చేయించింది. ఐతే,దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ప్రభాస్ ఈ ప్రేమకథని ఎప్పుడు చూపిస్తాడన్నది క్లారిటీ మాత్రం లేదు. రిలీజ్ మాత్రం బాగా లేటు అవుతుందనే వినిపిస్తోంది. ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ అశ్విన్ సినిమా సైతం పట్టాలు ఎక్కనుంది.