`కల్కి 2898 ఏడీ` అప్డేట్ ఇవ్వకపోతే తీవ్ర నిర్ణయాలు.. ప్రభాస్ అభిమాని వార్నింగ్.. రిలీజ్ పై క్లారిటీ
ప్రభాస్ నటిస్తున్న `కల్కి` సినిమా అప్ డేట్ కోసం అభిమాని వార్నింగ్ నోట్ పంచుకున్నాడు. మరోవైపు రిలీజ్ డేట్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
ప్రభాస్ నటిస్తున్న `కల్కి 2898ఏడీ` సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు. దానిపై టీమ్ స్పందించలేదు. మరోవైపు సినిమా ఎంత వరకు అయ్యింది, ఏం జరుగుతుందనేది క్లారిటీ లేదు. ఇంకోవైపు ఇప్పటి వరకు సినిమా నుంచి కేవలం గ్లింప్స్ మాత్రమే వచ్చింది. ప్రభాస్ పాత్రని పరిచయం చేశారు. అంతకు మించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో చాలా రోజులుగా ప్రభాస్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఇక తట్టుకోలేక ఓ వార్నింగ్ నోట్ని పంచుకున్నారు. రోహిత్ యాదవ్ అనే అభిమాని `కల్కి 2898 ఏడీ` టీమ్కి రిక్వెస్ట్ తో కూడా వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో అప్డేట్ ఇవ్వకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. బరువెక్కిన హృదయంతో ఈ నోట్ రాస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు. కానీ ఎలాంటి అప్డేట్ లేక తీవ్రంగా నిరాశ చెందుతున్నట్టు తెలిపాడు.
సహసం కోల్పోయిన పరిస్థితుల్లో, ఫ్రస్టేషన్తో సహాయం చేయలేని స్థితిలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్టు తెలిపారు సదరు అభిమాని. 48 గంటల్లో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ రావాలని, లేదంటే కఠినమైన చర్యల గురించి ఆలోచించడం తప్ప నాకు వేరే మార్గం లేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. దీన్ని లైట్ తీసుకోవద్దని, సీరియస్గా పరిగణించాలని వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ, దర్శకుడు, హీరోలను ఆయన కోట్ చేశాడు. దీని గురించి సీరియస్గా ఆలోచించాలని తెలిపారు రోహిత్ యాదవ్.
ఇదిలా ఉంటే `కల్కి 2898ఏడీ` సినిమాకి సంబంధించి త్వరలోనే అప్ డేట్ రాబోతుందట. ఉగాదికి రిలీజ్ డేట్పై క్లారిటీ ఇస్తారట. మరో రెండు రోజుల్లో అంటే ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ డేట్ని ఇవ్వబోతున్నారట. అంతేకాదు శ్రీరామ నవమి సందర్బంగానే ఓ ట్రీట్ రాబోతుందని తెలుస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం మేరకు ఏప్రిల్ 17 టీజర్ వచ్చే అవకాశం ఉంది.
ఇక సినిమాని మే 30న విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన అప్ డేటే ఉగాదికి ఇవ్వబోతున్నారని సమాచారం. ఇదే నిజమైతే రోహిత్ యాదవ్ కోరిక నెరవేర్చిన వారవుతారని చెప్పొచ్చు. ఈ మూవీని మాత్రం భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకి సాధ్యం కాని విధంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మొదటి రోజే ఇండియన్ సినిమా రికార్డులు షేక్ చేసే ఓపెనింగ్స్ ని రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న `కల్కి 2898 ఏడీ` చిత్రంలో ప్రభాస్.. భైరవ పాత్రలో కనిపిస్తారు. కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. నెగటివ్ రోల్ అని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చాలా మంది స్టార్స్ గెస్ట్ లుగా మెరుస్తారని సమాచారం. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ సినిమాని ఐదు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు.