పవన్ దెబ్బకి హరీష్కి మైండ్ బ్లాక్.. బలవంతంగా రీమేక్ చేయిస్తున్నారే?.. కక్కలేక మింగలేక స్టార్ డైరెక్టర్
పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్తో `భవదీయుడు భగత్ సింగ్` సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాని పక్కన పెట్టారని టాక్. మరోసారి రీమేక్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట పవన్ టీమ్.
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నెక్ట్స్ సినిమాల విషయంలో టూ మచ్ గందరగోళం నెలకొంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగే పూర్తి కాలేదు. కానీ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల సుజీత్తో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి హరీష్ శంకర్తో సినిమా ఎప్పుడు ఉంటుంది? సుజీత్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? `వినోదయ సీతం` పరిస్థితేంటి? సురేందర్ రెడ్డితో చేయాల్సిన ప్రాజెక్ట్ ముచ్చటేమిటి అనేది సస్పెన్స్, మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇదిలా ఉంటే హరీష్ శంకర్(Harish Shankar)తో పవన్ `భవదీయుడు భగత్సింగ్` సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. ఆల్మోస్ట్ ఈ మూవీ కోసం మూడేళ్లుగా వెయిట్ చేస్తున్నారు హరీష్ శంకర్. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించబోతుంది. పవన్తో, హరీష్ శంకర్తో మైత్రీ వాళ్లు సినిమా చేయాల్సి ఉండటం, పవన్తో హరీష్ సినిమా చేయాలనుకోవడంతో ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
పవర్ఫుల్ కంటెంట్ తో ఈ సినిమాని తెరకెక్కించాలని కూర్చున్నాడు హరీష్ శంకర్. విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా గూస్బంమ్స్ తెప్పించేలా ఉంది. ఒరిజినల్ కథతో `గబ్బర్ సింగ్`ని మించి చేస్తానని హామీ ఇచ్చాడు హరీష్. అయితే మారుతున్న రాజకీయ, సినిమా పరిణామాల నేపథ్యంలో పవన్ ఆలోచన కూడా మారిందట. ఆ ప్రభావం ఇప్పుడు హరీష్ శంకర్పై పడటం గమనార్హం. ఆ ప్రభావం `భవదీయుడు భగత్ సింగ్` క్యాన్సిల్ అయిపోయేంత వరకు వెళ్లిందని సమాచారం.
దీంతో హరీష్ శంకర్ తో రీమేక్ సినిమా చేయించబోతున్నారు పవన్ టీమ్. పవన్ సినిమాల ఎంపికలో, వాటిని సెట్ చేయడంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కీలక పాత్ర పోషిస్తారనే విషయం తెలిసిందే. వారంతా కలిసి `భవదీయుడు`స్క్రిప్ట్ ని పక్కన పెట్టి రీమేక్ చేయాలని ఫోర్స్ చేస్తున్నారట. విజయ్ హీరోగా నటించిన `థెరి` సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని హరీష్పై ప్రెజర్ పెంచుతున్నారట. ఆ కారణంగానే ఇప్పుడు హరీష్ కూడా తన సినిమాని పక్కన పెట్టి `థెరి` రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఈ సినిమా చేయడం తనకు ఇష్టం లేదని, కానీ ఇప్పటికే మూడేళ్లు ఖాళీగా ఉండటం, పవన్తో సినిమా చేయాలనుకోవడం కారణంగా ఈ రీమేక్ కి డైరెక్షన్ చేసేందుకు ఒప్పుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
అంతేకాదు త్వరలోనే ఈ సినిమాని ప్రారంభించబోతున్నారని లేటెస్ట్ టాక్. మరో వారం, పది రోజుల్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారని తెలుస్తుంది. అయితే ప్రారంభం ఎప్పుడైనా `హరిహరవీరమల్లు` షూటింగ్ కంప్లీట్ అయ్యాకనే ఈ సినిమా సెట్ పైకి వెళ్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే `థెరి` చిత్రాన్ని `పోలీస్` గా తెలుగులో దిల్రాజు డబ్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ అది పెద్దగా ఆదరణ పొందలేదు. పైగా ఇప్పుడు రీమేక్లను పట్టించుకునే వారే లేరు. అలాంటి టైమ్లో `థెరి`తో రిస్క్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పవన్ ఆలోచన మారడానికి, ఈ రీమేక్ చేయడానికి కారణం రాజకీయ ఏజెండా అని తెలుస్తుంది. `థెరి`లో అమ్మాయిని రేప్ చేయడం, తదనాంతరం ఆ హీరో దానిపై పోరాటడం వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ని ఇక్కడ మరింత బిల్డప్ చేసి, మరింత ఎఫెక్టీవ్గా ఆయా సన్నివేశాలను తెరకెక్కించాలని భావిస్తున్నారట. అవి వర్కౌట్ అయితే తెలుగులో మంచి ఆదరణ దక్కుతుందని, అది రాజకీయంగా పవన్కి కలిసొస్తుందని, పొలిటికల్గా మైలేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నారట. అంతేకాదు హరీష్ రీమేక్లు బాగా తీస్తారనే ఆలోచన కూడా ఆయనతో ఈ సినిమా చేయించడానికి ఓ కారణంగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ విషయంలో, పవన్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ కక్కలేక మింగలేక ఉన్నారని భోగట్టా.
త్రివిక్రమ్, పవన్ మంచి స్నేహితులు. వీరిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. బాగా పుస్తకాలు చదువుతారు. పవన్ ఏం చేయాలన్నా త్రివిక్రమ్ సలహాలు తీసుకుంటారని టాక్.
`థెరి` రీమేక్కి బ్యాకెండ్లో మరో స్టోరీ ఉంది. మొదట ఈ చిత్రాన్ని పవన్-సంతోష్ శ్రీనివాస్ లతో చేయాలనుకున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఇది సెల్వ్ అయ్యింది. ఆ తర్వాత రవితేజ-సంతోష్ శ్రీనివాస్తో సినిమా ప్రారంభమై కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ వర్కౌట్ కాలేదు. ఆదిలోనే ఆపేశారు. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పై సుజీత్-పవన్ కాంబినేషన్లో చేయాలనుకున్నారు. దానయ్య నిర్మాత. కానీ `థెరి` హక్కులు మైత్రీ వాళ్ల వద్ద ఉన్నాయి. ఆ స్థానంలో వేరే కథతో సుజిత్-పవన్ ని సెట్ చేశాడు త్రివిక్రమ్. మరోవైపు హరీష్తో `థెరి` రీమేక్ చేయిస్తున్నాడు మాటల మాంత్రికుడు.