- Home
- Entertainment
- రాజమౌళి ట్రాప్లో చిరు, పవన్, రవితేజ, వరుణ్ తేజ్.. టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ఆడియెన్స్ తికమక..
రాజమౌళి ట్రాప్లో చిరు, పవన్, రవితేజ, వరుణ్ తేజ్.. టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ఆడియెన్స్ తికమక..
టాలీవుడ్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఈ ట్రెండ్కి రాజమౌళి పునాది వేయగా.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజ, వరుణ్ తేజ్ వంటి హీరోలు అదే ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ఆడియెన్స్ ని తికమకపెడుతున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదల తేదీలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. వరుసగా వాయిదా పడుతూ, కొత్త రిలీజ్ డేట్లు ప్రకటిస్తూ ఇప్పుడు టాలీవుడ్లో రిలీజ్ డేట్ల గేమ్ నడుస్తుంది. అయితే ఇది డబుల్ గేమ్ గా ఉండటం ఆశ్చర్యానికి, కన్ ఫ్యూజన్కి కారణమవుతుంది. ఆడియెన్స్ ని తికమక పెడుతుంది. గందరగోళ పరిస్థితి తలెత్తుతుంది. వరుసగా రిలీజ్ డేట్లు, పైగా రెండు రిలీజ్ డేట్లతో ఆడియెన్స్ ని పూర్తిగా కన్ఫ్యూజన్లో పడేశారు భారీ చిత్రాల నిర్మాతలు.
ప్రస్తుతం టాలీవుడ్ని `ఆర్ఆర్ఆర్` సినిమా శాషిస్తుందని చెప్పొచ్చు. ఇది పాన్ ఇండియా లెవల్లో రూపొందిన చిత్రం కావడం, భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఆ సినిమా రిలీజ్ డేట్ని బట్టే మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయి. ఆ సినిమా ఎప్పుడొస్తుందనేది క్లారిటీ వస్తే, దానికి ముందూ, వెనకా రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసుకుంటున్నారు ఇతర చిత్రాల నిర్మాతలు. అయితే రిలీజ్ విషయంలో దర్శకుడు రాజమౌళి డబుల్ గేమ్ ఆడుతూ వచ్చారు. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కరోనా కారణంగా వాయిదా వేశారు.
ఆ తర్వాత కొన్ని రోజుల గ్యాప్తో కరోనా మహమ్మారి నుంచి బయటపడి పరిస్థితులు బాగుంటే మార్చి 18న విడుదల చేస్తామని, లేదంటే ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. దీంతో ఒక్క సినిమాకి రెండు రిలీజ్ డేట్ల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. కానీ ఆ కన్ఫ్యూజన్కి చెక్ పెడుతూ `ఆర్ఆర్ఆర్` టీమ్ సోమవారం స్పందిస్తూ మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు మిగిలిన సినిమాలు కూడా దాన్నే పాలో అవుతున్న నేపథ్యంలో డబుల్ రిలీజ్ డేట్లు అనేది ఓ ట్రెండ్గా మారిపోయింది. కొత్త ట్రెండ్ బాగానే ఉన్నా, ఆడియెన్స్ ని, నిర్మాతలను తికమక పెడుతుంది. ఇంకా పెద్ద గందరగోళానికి తెరలేపినట్టయ్యింది.
రాజమౌళి ట్రాప్లో పడ్డా చిరంజీవి `ఆర్ఆర్ఆర్` డేట్ కారణంగా తమ సినిమా రిలీజ్ డేట్ని మార్చేశారు. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన `ఆచార్య` చిత్రాన్ని వాయిదా వేశారు. `ఆర్ఆర్ఆర్` మార్చిలో వస్తుందని భావించి ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. `ఆర్ఆర్ఆర్` విడుదలై సంచలన విజయం సాధిస్తే, అది తమ `ఆచార్య`కి హెల్ప్ అవుతుందని చిరంజీవి భావిస్తున్నారు. ఎందుకంటే ఇందులో రామ్చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. `ఆర్ఆర్ఆర్`తో చరణ్ మార్కెట్ పెరుగుతుంది. దీంతో `ఆచార్య`ని కూడా ఇతర భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ 29న ఫిక్స్ చేశారు. `ఆర్ఆర్ఆర్` ముందే రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎలాంటి క్లాషెస్ లేకుండా ఇంకో డేట్కి `ఆచార్య`ని రంగంలోకి దించారు.
అయితే పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు చిరంజీవి. ఏప్రిల్ 29 శుక్రవారం, ఆ తర్వాత శని, ఆదివారంతోపాటు సోమ, మంగళవారాలు కూడా `ఆచార్య`కి కలిసొస్తున్నాయి. మంగళవారం(మే2) రంజాన్ మెగాస్టార్కి హెల్ప్ కాబోతుంది. దీంతో వరుసగా ఐదు రోజులు `ఆచార్య`కి కాసుల వర్షం కురిపిస్తాయని యూనిట్ భావిస్తుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
చిరంజీవితోపాటు పవన్ కళ్యాణ్ కూడా రాజమౌళి(ఆర్ఆర్ఆర్) ట్రాప్లో పడ్డారు. ఆయన నటించిన `భీమ్లా నాయక్` చిత్రానికి కూడా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సిన ఈ సినిమాని `ఆర్ఆర్ఆర్` కారణంగా వాయిదా వేశారు. ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు కొత్తగా రిలీజ్ డేట్ మార్చారు. కుదిరితే ఫిబ్రవరిలోగానీ, లేదంటే ఉగాది కానుకగా ఏప్రిల్ 1న గానీ విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఫిబ్రవరి 25న విడుదలయ్యే ఛాన్స్ 99శాతం లేదు. దీంతో ఏప్రిల్ 1నే `భీమ్లా నాయక్` రాబోతున్నారని చెప్పొచ్చు. ఇలా సంక్రాంతి సందర్భంగా పోటీ పడాల్సిన ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ఆరు రోజుల గ్యాప్తో మరోసారి పోటీ పడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25న విడుదల కాదని తెలిసిన వరుణ్ తేజ్ తన `గని` సినిమాతో ప్లాన్ ఏ, ప్లాన్ బీతో రంగంలోకి దిగారు. `భీమ్లా నాయక్` ఫిబ్రవరి 25 నుంచి వెళ్లిపోతే అదే రోజు `గని` చిత్రాన్ని విడుదల చేయాలని, లేదంటే మార్చి 4న రిలీజ్ చేయబోతున్నట్టు `గని` నిర్మాతలు ప్రకటించారు. ఓ రకంగా వరుణ్ తేజ్ కూడా రాజమౌళి డబుల్ గేమ్ ట్రాప్లో ఇరుక్కుపోయారని చెప్పొచ్చు. మరోవైపు ఫిబ్రవరి 25న `భీమ్లా నాయక్` వచ్చే పరిస్థితి తక్కువ అని భావించిన శర్వానంద్, రష్మిక నటిస్తున్న `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాన్నిఅదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా వెల్లడించారు. ఇది కూడా `భీమ్లా నాయక్` ఏప్రిల్ 1న రాబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సంక్రాంతి మిస్ అయినా ఉగాది మిస్ కాకూడదని భావిస్తున్నారట మేకర్స్.
ఇక రాజమౌళి(ఆర్ఆర్ఆర్) ట్రాప్లో పడ్డవారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నారు. ఆయన నటిస్తున్న `ఖిలాడి` చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతుంది. ఎలాంటి భయాలు లేకుండా సోలోగా ఈ చిత్రం రాబోతుంది. కానీ ఆయన నటించిన మరో సినిమా `రామారావుః ఆన్ డ్యూటీ` సినిమాకి మాత్రం రెండు రిలీజ్ డేట్లు ప్రకటించారు. మొదట ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ అదే రోజు `ఆర్ఆర్ఆర్` ఫిక్స్ అయ్యింది. దీంతో ఆ పెద్ద సినిమాతో ఢీ కొట్టడం అసాధ్యమని చెప్పొచ్చు. దీంతో అవకాశాన్ని బట్టి ఏప్రిల్ 15న విడుదల చేస్తామని, ప్లాన్ ఏ, ప్లాన్ బీని ప్రకటించింది. అయితే ఏప్రిల్ 14న `కేజీఎఫ్2` రాబోతుంది. ఈ రెండు డేట్లలోనూ రవితేజ `రామారావు`కి పోటీ తప్పేలా లేదు. మరి ఈ డేట్లకి ఫిక్స్ అవుతారా? మళ్లీ రిలీజ్ డేట్ని మారుస్తారా? అనేది చూడాలి.
ఇదిలా ఉంటే తెలుగులో రాబోతున్న మరో భారీ సినిమా ప్రభాస్ `రాధేశ్యామ్` రిలీజ్ డేట్ ఇంకా రాలేదు. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేయబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ రిలీజ్ డేట్ లీక్ అయ్యిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. త్వరలోనే దీనిపై `రాధేశ్యామ్` స్పష్టత ఇవ్వనుంది. అయితే ఇదే డేట్కి వస్తే.. `రాధేశ్యామ్`తో సమ్మర్ సినిమాల మోత మోగనుందని చెప్పొచ్చు.