ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. ఈ దెబ్బకు క్లారిటీ?
ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా కొరటాలతో చేస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. సరైన సమయంలో ఎన్టీఆర్ సరైనా సినిమా చేయబోతున్నాడా? తన పొలిటికల్ ఎంట్రీపై ఈ సినిమాతో క్లారిటీ ఇవ్వబోతున్నాడా?
ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్చరణ్ మరో హీరో. తెలుగులోనే కాదు, ఇండియా వైడ్గానూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ కూడా మారబోతుంది. నేషనల్ స్టార్గా ఎదగబోతున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నెక్ట్స్ సినిమాగా కొరటాల శివతో తన `ఎన్టీఆర్30` చేస్తున్నాడు ఎన్టీఆర్. మొదట త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ స్థానంలో తనకు `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ని అందించిన కొరటాల శివతో చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సారి నేషనల్ వైడ్గా రిపేర్లు చేయబడును అని సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా ప్రకటించింది యూనిట్. దీంతో ఈ సినిమాపై ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది.
తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో, పలు ప్రధాన మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తాడని, రాజకీయాల వల్ల విద్యార్థుల జీవితాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో, స్టూడెంట్స్ కోసం రాజకీయాల్లోకి వచ్చి తనదైన స్టయిల్లో పోరాటం చేసే వ్యక్తిగా ఎన్టీఆర్ కనిపిస్తాడని తెలుస్తుంది. మొత్తంగా రాంగ్ సిస్టమ్కి వ్యతిరేకంగా వెళ్లి పోరాడే నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని, ఈ సినిమా ప్రధాన కథ ఇదే అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
జనరల్గా దర్శకుడు కొరటాల శివ సినిమాలన్నీ సామాజిక సందేశాలుగా, సిస్టమ్ని సెట్ చేసేవిగానే ఉంటూ వస్తున్నాయి. `మిర్చి`లో ఫ్యాక్షన్ గొడవలు వద్దు అని చెప్పాడు. `శ్రీమంతుడు`లో రైతులు, పల్లెటూర్లు బాగుండాలని, మన పుట్టిన ఊరు కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని చెప్పాడు. `జనతా గ్యారేజ్`లో సిస్టమ్లోని రాంగ్స్ పర్సన్స్ ని ఏరివేయడం, ప్రకృతి ప్రాధాన్యతని వివరించాడు. ఇక `భరత్ అనే నేను`లో రాజకీయాల్లోని కరప్షన్ని, అలాగే జనం సిస్టమాటిక్గా మారాలని చూపించాడు. ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న `ఆచార్య`లోనూ దుర్మార్గాలపై నక్సల్ పోరాటాన్ని చూపించబోతున్నాడు.
ఇలా కొరటాల తీసే ప్రతి సినిమా సమాజంలోని అవినీతికి, తప్పుకి వ్యతిరేకంగా పోరాడటం చూపించారు. అందులో భాగంగానే ఎన్టీఆర్తో చేసే సినిమాలో రాజకీయాలకు విద్యార్థులు ఎలా బలవుతున్నారనేది చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడే ఓ కొత్త చర్చకి తెరలేపింది. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్కి సంబంధించి ఈ సినిమాతో క్లారిటీ రాబోతుందని ప్రచారం జరుగుతుంది.
నిజానికి ఎన్టీఆర్కి మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండేదట. `నాగ` సినిమా సమయంలోనే ఆయన రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడేవారట. ఆ సినిమాలోనూ విద్యార్థి నాయకుడిగా కనిపించాడు. అదే సమయంలో తాను మరో పదేళ్లలో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్తానని ఆ సినిమా టైమ్లో యూనిట్తో ఎన్టీఆర్ అనేవాడట. ఆ సినిమాకి పనిచేసిన ఓ అసిస్టెంట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
అందుకు తగ్గట్టుగానే ఆయన 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు జనం కోకొల్లలుగా తరలి వచ్చారు. సీనియర్ ఎన్టీఆరే వచ్చాడా? అనేంతగా ఆయన్ని చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చాడు. దీంతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకోబోతుందని అంతా అనుకున్నారు. ఎన్టీఆర్ని ఓ సునామీతో పోల్చారు. కానీ ఆయనకి కారు యాక్సిడెంట్ కావడం మొత్తం తలక్రిందులు చేసింది.
ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాలు అనే మాట ఎత్తితేనే ఆయన మండిపోతున్నారు. సమాధానం చెప్పేందుకు దూరంగా ఉంటున్నారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేదని పలు మార్లు స్పష్టం చేశాడు. కానీ ఇటీవల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఎంట్రీని బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారంలోనూ ఎన్టీఆర్ సీఎం అంటూ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేయడం, ఫ్లెక్సీలు ప్రదర్శించడం చేశారు. ఒకానొక దశలో చంద్రబాబుని కూడా నిలదీశారు. ఇంతగా ఎన్టీఆర్ ఎంట్రీని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో సినిమా చేయడం సరైన సమయంలో సరైనా సినిమా అనే ప్రచారం జరుగుతుంది. ఇది రాజకీయాలపై చర్చించబోతుందని, అదే సమయంలో ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి ఓ క్లారిటీని ఇవ్వబోతుందని అంటున్నారు. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? లేదా ? అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. అదే సమయంలో తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఈ సినిమాతో హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనీ అంటున్నారు.
నిజానికి ప్రస్తుతం టీడీపీ బాగా బలహీనంగా ఉంది. నాయకత్వ లోపం కనిపిస్తుంది. చంద్రబాబు ఔట్డేటెడ్ లీడర్గా మారిపోయాడనే వార్తలొస్తున్నాయి. కొత్త రక్తం నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ రాజకీయాలకు పనికి రాడనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీని నడిపేంత, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంత శక్తిసామర్థ్యాలు బాలకృష్ణకి లేవనే టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంతా ఇప్పుడు ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టు టాక్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు. తనకి రాజకీయాలపై వచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అన్నది ఈ సినిమాతో తేలబోతుందట. మరి ఈ సినిమా ఏం చెప్పబోతుందనేది విడుదల వరకు వేచి చూడాలి. ఇది జూన్లో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 29కి విడుదల కానుంది.