- Home
- Entertainment
- నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. తాజాగా ఈ చిత్రానికి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ ఆవేశంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 చిత్రం ఇటీవల విడుదలైంది. అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్ర సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు
అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. అఖండ తాండవం విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు, యావత్ భారత దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి.
నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు
మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలగలిపిన సినిమా ఆపాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతోంది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాల్లో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాని కూడా ఒక నిత్యవసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు’ అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. బాలకృష్ణకి ఇంత ధైర్యం ఏంటి అని నన్ను చూసి ఉలిక్కి పడి చస్తుంటారు అని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అఖండని అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాం
పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు మాతండ్రి గారికి పాదాభివందనాలు. ఇది యావత్ ప్రపంచ ప్రేక్షకులకు సంబంధించిన సినిమా. ఈ సినిమా కేవలం భారతం, భాగవతానికి సంబంధించిన సినిమానే కాదు.. ఒక బైబిలు ఒక ఖురాన్ కి కూడా సంబంధించిన సినిమా. మన వేదం నుంచే విజ్ఞానం పుట్టింది. మన దేశం గొప్పతనం మనం చెప్పుకోవాలి. అప్పుడే యువతరానికి అర్థమవుతుంది. అఖండ సినిమా కూడా ఒక పరీక్ష లాంటిదే. సరిగ్గా కోవిడ్ సమయంలో రిలీజ్ అయింది. థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారా లేదా అన్న ఒక మీమాంస ఉండేది. అలాంటి సమయంలో భగవంతుడి మీద భారం వేసి సినిమా రిలీజ్ చేశాం. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది.
పిల్లలకు అఖండ 2 చూపించాలి
ఆ తర్వాత మిగతా నిర్మాతలు అందరికీ ధైర్యం వచ్చి సినిమాలను రిలీజ్ చేయడం చేశారు. ఆ తర్వాత చేసిన వీర సింహారెడ్డి నేలకొండ భగవత్ కేసరి డాకు మహారాజ్ ఇప్పుడు అఖండ తాండవం అన్నీ కూడా అద్భుతమైన విజయాలు. అన్ని సినిమాల్లో కూడా అద్భుతమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. అఖండలో దేవుడు మనిషిలో పూనాడు. ఇందులో మనిషే దేవుడైతే ఏమవుతుంది.. సంభవామి యుగే యుగే అన్నదే చూపించాం. సకుటుంబం సపరివార సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూస్తున్నారు. పిల్లలకు కూడా ఈ సినిమాని చూపించి, మన మూలాల గురించి తెలియజేయాలని కోరుతున్నాను అని బాలయ్య తెలిపారు.

