మాతృకతో పోల్చితే `నా సామి రంగ`లో చేసిన మార్పులేంటి?.. క్లైమాక్స్ ని మొత్తం మార్చేశారా?
నాగార్జున వరుస పరాజయాల అనంతరం ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ సంక్రాంతికి `నా సామి రంగ` చిత్రంతో వస్తున్నాడు. ఇది మలయాళ మూవీకి రీమేక్. ఆ మూవీతో పోలిస్తే ఎలాంటి మార్పులు చేశారనేది చూస్తే..
నాగార్జున ఈ సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నారు. ఆయన `నా సామి రంగ` సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా రేపు ఈ మూవీ విడుదల కాబోతుంది. సంక్రాంతి బరిలో నిలిచిన నాలుగుసినిమాల్లో మూడు వచ్చాయి. అందులో ఒకటి హిట్, ఒకటి యావరేజ్, మూడోది నెగటివ్ టాక్ని తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `నా సామి రంగ` మిగిలిపోయింది. ఇది ఆదివారం సందడి చేయబోతుంది.
![article_image2](https://static-ai.asianetnews.com/images/01hkermsxfsre26wnbr8c7an6k/naa-saami-ranga_300x171xt.jpg)
Naa Saami Ranga joju george
అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి బజ్ లేదు. ప్రమోషన్స్ పరంగా బాగానే హంగామా చేస్తున్నా, హైప్ రావడం లేదు. మహేష్ బాబు `గుంటూరు కారం`, `హనుమాన్` చిత్రాల మధ్య ఈ మూవీని ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ నాగార్జున చాలా తెలివిగా ఈ మూవీని చేశాడు. సంక్రాంతికి పండక్కి కావాల్సిన, ఉండాల్సిన మసాలాలు రంగరించి తెరకెక్కించినట్టు టీజర్, ట్రైలర్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ బజ్ లేకపోవడం గమనార్హం. నాగ్ సినిమాలు ఇటీవల పెద్దగా సత్తా చాటలేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.
డాన్సు మాస్టర్ విజయ్ బిన్ని ఈ మూవీతో దర్శకుడిగా మారారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ రీమేక్ అనే విషయం తెలిసిందే. మలయాళంలో విజయం సాధించిన `పురింజు మరియంజోస్` చిత్రానికి రీమేక్. నాలుగేళ్ల క్రితం ఇది మలయాళంలో తెరకెక్కి హిట్ అయ్యింది. ఇప్పుడు అనేక చేతులు మారి నాగ్ వరకు వచ్చింది. మొత్తానికి విడుదలకు సిద్ధమైంది. అయితే మలయాళంలో ఎవరు నటించారు, తెలుగులో చేసిన మార్పులేంటి? అనేది ఓ సారి చూస్తే..
Naa Saami Ranga Teaser
మలయాళంలో జోజు జార్జ్ మెయిన్ హీరోగా నటించాడు. తెలుగులో ఆ పాత్రని నాగార్జున చేశాడు. ఆయన పాత్ర చుట్టూనే సినిమా సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ మూవీ ఇది. ఇక హీరోకి స్నేహితుడి పాత్రలో అక్కడ చెంబన్ వినోద్ జోస్ నటించాడు. తెలుగులో ఆ పాత్రని అల్లరి నరేష్ చేస్తున్నాడు. హీరో సహాయంతో లవర్ని పెళ్లి చేసుకునే కుర్రాడి పాత్రలో తెలుగులో రాజ్ తరుణ్ నటిస్తున్నారు. ఇక హీరోకి జోడీగా అక్కడ నైలా ఉస హీరోయిన్గా నటించగా, తెలుగులో ఆషికా రంగనాథ్ నటించింది.
మలయాళంలో జోషి దర్శకత్వం వహించగా, తెలుగులో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారి తెరకెక్కించాడు. అక్కడ దాదాపు 20కోట్లతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక్కడ సుమారు 45కోట్లతో రూపొందించారు. అక్కడ మూవీ క్రిస్టియన్ రిలీజియన్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. తెలుగులో ఇది తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా, హిందూ రిలీజియన్లో సాగుతుంది. జాతర ఎపిసోడ్ మెయిన్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.
అయితే క్లైమాక్స్ లో మాతృకలో మెయిన్ హీరోలిద్దరు చనిపోతారు. కానీ తెలుగులో మాత్రం మార్పులు చేశారట. తెలుగులో సాడ్ ఎండింగ్ని రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం. పైగా పండుగ పూట ఇలాంటి సాడ్ ఎండింగ్ అంటే చాలా ప్రభావం పడుతుంది. దీంతో ఆ విషయంలో చాలా మార్పులు చేశారట. కేవలం అల్లరి నరేష్ పాత్ర మాత్రమే చనిపోతుందని, నాగ్ పాత్రని చంపకుండా కొద్దిగా మార్పు చేశారని తెలుస్తుంది.మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక దీని అదృష్టం పరీక్షించుకునేందుకు ఇంకా ఒక్కరోజే ఉంది. మరి ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి.