కరోనా జయించిన వాళ్ళు స్వచ్ఛందంగా ప్లాస్మా డొనేషన్ చేయాలిః నాగార్జున
కరోనాని జయించడంలో కీలకంగా మారిన ప్లాస్మా డొనేషన్పై హీరో నాగార్జున అవగాహన కార్యక్రమం చేపట్టారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్లాస్మా డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా గురువారం నిర్వహించిన ప్లాస్మా దానం ప్రచార కార్యక్రమంలో నాగార్జున అతిథిగా పాల్పొన్నారు.
ఈ సందర్భంగా నాగ్ స్పందిస్తూ, రానున్న రోజుల్లో ప్లాస్మా డొనేట్ చేసే వారి సంఖ్య మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు ముందుకు రావడం సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా వారిని అభినందించారు. సీపీ సజ్జనార్ చొరవ, కృషి అభినందనీయమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, ప్లాస్మా డొనేట్ చేసేవారు దేవుళ్లతో సమానమన్నారు. ఇప్పటివరకు 388 మంది ప్లాస్మా దానం చేయడం వల్ల దాదాపు 600 మంది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.
ప్లాస్మా దానం చేయాలనుకునేవారు సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ నెం. 90002 57058, 94906 17440లకు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి కూడా ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా చిరు అందరిని కడుపుబ్బ నవ్వించడం హైలైట్గా నిలిచింది.