`జబర్దస్త్`కి నాగబాబు రీఎంట్రీ.. వాళ్ల కారణంగానే దూరమయ్య అంటూ అసలు విషయం బయటపెట్టిన మెగా బ్రదర్
`జబర్దస్త్` కామెడీ షోకి సక్సెస్ ఫుల్ జడ్జ్ గా ఉన్న నాగబాబు ఎందుకు బయటకు వచ్చాడు, అందులో ఆసలేం జరిగింది? ఇప్పుడు మళ్లీ పిలుపు వస్తే వెళ్తారా? ఇవన్ని విషయాలను ఓపెన్గా చెప్పారు నాగబాబు.
`జబర్దస్త్` షోకి కొన్నేళ్లపాటు నాగబాబు జడ్జ్ గా ఉన్నారు. షో సక్సెస్లో కీలక భూమిక పోషించారు. కానీ రెండేళ్ల క్రితం ఆయన అనూహ్యంగా షోనుంచి బయటకు వచ్చారు. షో నిర్వహకులతో పడకపోవడం వల్ల ఆయన తప్పుకున్నట్టు తెలిసింది. వాళ్లతో పడకనే తాను బయటకు వచ్చినట్టు నాగబాబు తెలిపారు. కానీ ఇప్పుడు అసలు విషయం షేర్ చేసుకున్నారు. `జబర్దస్త్`కి రీఎంట్రీపై కూడా ఆయన స్పందించారు. ఓ యూట్యూబ్(సుమన్ టీవీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
బుల్లితెర తనకు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు నాగబాబు. `జబర్దస్త్`తోపాటు మిగిలిన షోస్ కూడా ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టాయని, టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసిందని చెప్పారు. `జబర్దస్త్` షో విషయంలో తాను హ్యాపీగానే ఉన్నానని చెప్పారు నాగబాబు. తనకి తాను బయటకు వచ్చానని, తనని ఎవరూ పంపించలేదన్నారు. అయితే తాను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందనే విషయంపై ఆయన ఓపెన్ అయ్యారు.
మల్లెమాల హెడ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, తనకు ఎలాంటి గొడవలు లేవన్నారు. అలాగే ఈటీవీ వారితోనూ విభేదా లేవని పేర్కొన్నారు. కానీ అందులో ఉండే ఎంప్లాయిస్ కారణంగానే తాను బయటకు వచ్చినట్టు చెప్పారు. మేనేజర్ స్థాయి ఉద్యోగులు చేసిన అతి, యాటిట్యూడి చూపించడం వల్ల తాను ఇబ్బంది పడ్డానని, యాజమాన్యం వద్ద మార్కులు కొట్టేందుకు కాస్త అతి చేసేవారని, వాళ్లకి ఏం తెలియకపోయినా ఓవర్ చేసేవాళ్లని చెప్పారు. వారి ఆటిట్యూడ్ విషయంలోనే తాను ఇమడలేకపోయానని తెలిపారు.
అయితే అది వాళ్ల పాలసీ కావచ్చు, ఓ కంపెనీకి వాళ్లకంటూ కొన్ని పారామీటర్స్, పాలసీలు, రూల్స్ ఉంటాయి. ఎవరైనా వాటికి అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. కానీ నేను మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని, అందుకే దూరమవ్వాలనుకుని బయటకు వచ్చానని, అంతేకాదు పెద్ద వారితో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పారు. అయితే తనతోపాటు వచ్చిన చమ్మక్ చంద్ర, ఆర్పీల విషయంపై ఆయన మాట్లాడుతూ, తాను ఒంటరిగానే బయటకు వచ్చానని చెప్పారు.
చమ్మక్ చంద్ర, ఆర్పీలను తాను రమ్మనలేదని, వారినే కాదు ఎవరినీ రమ్మని తాను చెప్పలేదన్నారు. వాళ్లు కూడా స్వతహాగానే బయటకు వచ్చారని, వచ్చాక వాళ్లు హ్యాపీగానే ఉన్నారని చెప్పారు. చమ్మక్ చంద్ర ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడని, సినిమాలు చేస్తున్నాడని తెలిపారు. ఆర్పీ కొంత ఇబ్బంది పడ్డా ఇప్పుడు బాగానే సెటిల్ అయ్యాడని, ఇటీవల నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టాడని, దానికి మంచి ఆదరణ ఉందన్నారు. తాను బిజీ కారణంగా దానికి వెళ్లలేదని, ఓ రోజు వెళ్లి చేపల పులుసు టేస్ట్ చేస్తానని చెప్పారు.
మళ్ళీ జబర్దస్త్ కి వెళ్తారా అనే ప్రశ్నకి నాగబాబు స్పందిస్తూ, తనకు తాను అనుకుని బయటకు వచ్చానని, తాను మళ్లీ వెళ్లలేనని తెలిపారు. అయితే మళ్లీ నిర్వహకులు(మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి) నుంచి పిలుపు వస్తే ఆలోచిస్తానని, వారితో నాకు గొడవలు లేవు కాబట్టి వెళ్లేందుకు అభ్యంతరం లేదని చెప్పారు నాగబాబు.