పిల్లలకు పాల పాకెట్లు కూడా కొనివ్వలేకపోతున్నా..దీనస్థితి చెబుతూ మహేష్ డూప్ కన్నీళ్లు..
అచ్చం మహేష్బాబులా కనిపించే శ్రీను.. మహేష్బాబు డూప్గా పాపులర్ అయ్యారు. సూపర్స్టార్ డూప్గా పేరొచ్చింది కానీ ఆదాయం లేదు. దీంతో పస్తులుండాల్సిన పరిస్థితి. తమ పిల్లలకు పాలు కూడా కొనివ్వలేకపోతున్నా అంటూ తన దీన స్థితి వెల్లడించారు మహేష్ డూప్ శ్రీను.
ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించారు. లాక్ డౌన్, కరోనా తమ జీవితాలను ఎలా రోడ్డున పడేశాయో తెలిపారు. తమ ఆర్థిక ఇబ్బందులు, దీన స్థితి చెబుతూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనరల్గా సినిమాల్లో స్టార్ హీరోలకు డూపులుంటారు. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా చాలా మందికి డూపులున్నారు. అలానే మహేష్కి కూడా డూప్ ఉన్నారు. వారిని సినిమాల్లో డూప్గా వాడుకుంటారు. డూప్గా షోస్ చేయిస్తుంటారు.
వెండితెరపై హీరోగా తళుక్కుమనే ఈ డూప్ల నిజ జీవితాలు మాత్రం ఎంతో దారుణంగా ఉంటాయని చెప్తున్నాడు మహేశ్బాబు జిరాక్స్లా కనిపించే జూనియర్ ఆర్టిస్టు శ్రీను. దూరం నుంచి చూస్తే అచ్చం మహేశ్బాబులా కనిపించే శ్రీను ఆ మధ్య పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేశాడు. దీంతో తనకు పేరు, గుర్తింపు రావడంతో కెరీర్ గాడిన పడినట్టే అనుకున్నాడు. ఇంతలో కరోనా రూపంలో పెద్ద బండ మీద పడ్డట్టయ్యింది.
కరోనాతో తమకి ఉపాధి పోయిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వెల్డడించారు. ఆదుకోండంటూ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతకు ముందు ఒక్క ప్రోగ్రామ్ చేస్తే రెండు వేల రూపాయలు ఇచ్చేవారని, అలా నెలకు 5 ప్రోగ్రాంలు దొరికినా చేతికి పదివేలు వచ్చేవి, ఇల్లు గడిచేదని కానీ కరోనా నేపథ్యంలో చాలావరకు ప్రోగ్రామ్స్ ఉండటం లేదని వాపోయాడు. దీంతో తనకు ఆదాయమే రావట్లేదని, డబ్బు సంపాదించే మార్గం కూడా దొరకడం లేదని దిగులు చెందాడు.
ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని, దీంతో పెళ్లాం పిల్లలను పోషించలేక కొన్నిసార్లు వారిని కూడా పస్తులుంచుతున్నానంటూ కంటతడి పెట్టుకున్నాడు. తనకు ముగ్గులు పిల్లలున్నారని, పెద్దోడికి 9 ఏళ్లు, మిగతా ఇద్దరిదీ(కవల పిల్లలు) పాలు తాగే వయసు అని తెలిపాడు. వారికి పాలు కూడా కొనలేని దుస్థితిలో ఉన్నానన్నాడు. పైగా తనది అద్దె ఇల్లు అని, ఆదాయం తక్కువ, ఖర్చులేమో ఎక్కువని చెప్తున్నాడు. రాబడి లేకపోవడంతో తాను పస్తులుండి పిల్లల ఆకలి తీర్చుతున్నానని పేర్కొన్నాడు.
ఇండస్ట్రీలో తనలా చాలామంది ఉన్నారని, మమ్మల్ని ఆదుకునే వాళ్లు ఎవరూ లేరని బాధపడ్డాడు. ఏ రోజు పని దొరికితే ఆరోజే సంతోషపడాలి.. అంతేతప్ప తమ జీవితాల్లో మంచి రోజులు అనేవే లేవు అంటూ శ్రీను ఎమోషనల్ అయ్యాడు.
ఇక తనను కరోనా కష్ట కాలంలో అంతో ఇంతో మహేశ్బాబు అభిమానులే ఆదుకుని అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు. ఈ హీరోకు డూప్గా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపాడు. `రాజకుమారుడు` సినిమా నుంచి ఆయనకు డూప్గా చేస్తున్నానని, తనకు ఏదైనా పని ఇచ్చి ఆదుకోవాలంటూ నిర్మాతలను అభ్యర్థిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు తాను మహేష్తో మాట్లాడలేదని, ఆయనతో మాట్లాడాలంటే భయమేస్తుందని చెప్పాడు.