- Home
- Entertainment
- కెరీర్ మొదటి పార్ట్ వరకు నాకు పారితోషికం ఇవ్వలేదు.. సంచలన విషయాన్ని బయటపెట్టిన మహేష్ బాబు..
కెరీర్ మొదటి పార్ట్ వరకు నాకు పారితోషికం ఇవ్వలేదు.. సంచలన విషయాన్ని బయటపెట్టిన మహేష్ బాబు..
మహేష్ బాబు ప్రస్తుతం సూపర్ స్టార్, తొలితరం సూపర్ స్టార్ కృష్ణ తనయుడు. అలాంటిది సూపర్ స్టార్కి పారితోషికాలు ఇవ్వలేదట. షాకిచ్చే విషయం బయటపెట్టాడు మహేష్ బాబు.

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా కెరీర్ని ప్రారంభించారు. నాన్న కృష్ణ నటించిన చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిశాడు. చిన్నప్పటి కృష్ణ పాత్రలతోపాటు నాన్నతోపాటు కలిసి నటించాడు. తమ్ముడి పాత్రలు కూడా పోషించాడు. దాదాపు తొమ్మిది సినిమాల్లో మహేష్ బాబు కనిపించాడు. `కొడుకు దిద్దిన కాపరం` చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.
`రాజకుమారుడు` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇది ఓ మోస్తారుగానే ఆకట్టుకుంది. హిట్ అని చెప్పలేని పరిస్థితి. `యువరాజు`, `వంశీ` చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో కృష్ణవంశీ మ్యాజిక్ పనిచేసింది. ఫ్యామిలీ అనుబంధాలు, ఎమోషన్స్ తో తెరకెక్కిన `మురారీ` చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇందులోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్.
ఆ తర్వాత `టక్కరిదొంగ`, `బాబీ` చిత్రాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి. అనంతరం వచ్చిన `ఒక్కడు` సినిమా టాలీవుడ్లోనే ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా, కలెక్షన్ల పరంగా దుమ్ములేపిన మూవీగా నిలిచింది. కలెక్షన్లు అంటే ఏంటో చూపించిన చిత్రమిది. పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత అడపాదడపా పరాజయాలు పడ్డా, మహేష్ కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ వెళ్లింది.
ఇదిలా ఉంటే మహేష్ బాబు హీరోగా కెరీర్ మొదటి భాగంలో తనకు ఎవరూ పారితోషికాలు ఇవ్వలేదట. ఇది నీకు రెమ్యూనరేషన్ అని ఫిక్స్ చేసి ఎవరూ ఇచ్చింది లేదన్నాడు మహేష్. ఖర్చుల వరకు తప్పితే పెద్దగా ఇవ్వలేదటన్నారు. కమర్షియల్ హిట్స్ పడ్డాక పారితోషికం ఇవ్వడం స్టార్ట్ చేశారని తెలిపారు. ఈ లెక్కన మహేష్కి `ఒక్కడు` వరకు పెద్దగా పారితోషికం తీసుకోలేదని తెలుస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ.. తన సినిమాలు నష్టపోతే పారితోషికాలు వెనక్కి ఇచ్చేవాడు, నిర్మాతగా ఉన్నప్పుడు కూడా అలానే చేశాడు. ఆ అలవాటు మీక్కూడా ఉందా అని అడగ్గా, `కెరీర్ మొదటి భాగంలో తాను పారితోషికం తీసుకోలేదని, ఎవరూ రెమ్యూనరేషన్ ఇవ్వలేదు` అని తెలిపారు మహేష్. అంటే అది నిర్మాతలకు హెల్ప్ అయినట్టే కదా అని వెల్లడించారు. కమర్షియల్ హిట్ పడ్డాకనే పారితోషికం ఫిక్స్ చేసి ఇచ్చారని తెలిపారు సూపర్ స్టార్. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వైరల్ అవుతుంది.
ప్రారంభంలో పారితోషికం తీసుకోని మహేష్ ఇప్పుడు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ఒక్కోమూవీకి 70-80కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ బాబు..రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. పదేళ్ల క్రితం కమిట్మెంట్ని ఇప్పుడు చేయబోతున్నారు. ఎస్ఎస్ఎంబీ29 పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీ ప్రారంభానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ మూవీకి ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పనిచేస్తారని సమాచారం. అంతేకాదు గ్లోబల్ ఫిల్మ్ రేంజ్లో దీన్ని తెరకెక్కించబోతున్నారు రాజమౌళి.