దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులు వీరే
Dadasaheb Phalke Award : భారతీయ సినీ రంగంలో అత్యున్నత అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తెలుగు ప్రముఖులు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపి, దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన దిగ్గజాలు వీరే.

దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న తెలుగు దిగ్గజాలు వీరే
Dadasaheb Phalke Award : భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. ప్రతి ఏడాది సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన లెజెండరీ కళాకారులకు ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు 55 మంది సినీ ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కార గ్రహీతలకు స్వర్ణ కమలం (గోల్డెన్ లోటస్) పతకం, శాలువా, రూ.10 లక్షల నగదు బహుమతి ప్రదానం చేస్తారు. తాజాగా 2023 సంవత్సరానికి ఈ గౌరవం మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్కు ప్రకటించారు. అయితే.. ఈ ప్రతిష్మాతక అవార్డును అందుకున్న తెలుగు ప్రముఖులు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు సినీ పరిశ్రమను అభివృద్ధి పథంలో నడిపి, తమ సృజనాత్మక ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన వారు ఈ దిగ్గజాలు.
BN Reddy
బి.ఎన్. రెడ్డి (1974) – తెలుగు సినిమా దర్శక స్వరూపం
తెలుగు సినిమాకు పునాది వేసిన వారిలో ఒకరైన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి( బి. ఎన్. రెడ్డి) 1974లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును పొందిన తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు ఆయనే. తెలుగు సినిమాకు నూతన దిశానిర్దేశం ఇచ్చిన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మల్లీశ్వరి’ (1951), ‘బంగారు పాప’ (1939), ‘స్వర్గసీమ’ (1945) వంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించారు. తెలుగు సినిమాకు సాంకేతిక నైపుణ్యం, జాతీయతా భావాన్ని తీసుకువచ్చిన మహనీయుడు బి. ఎన్. రెడ్డి.
LV Prasad
ఎల్.వి. ప్రసాద్ (1982) – సినీ పరిశ్రమలో దిశానిర్దేశకుడు
తెలుగు సినీ పరిశ్రమ దిశానిర్దేశకుడు ఎల్.వి. ప్రసాద్. ఆయన 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు పొందిన ఎల్.వి. ప్రసాద్ భారతీయ సినిమా పరిశ్రమ అభివృద్ధికి పాటుపడ్డారు. ఆయన తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల తొలి టాకీ చిత్రాల్లో నటించి, దర్శకుడిగా వ్యవహరించారు. ‘ఆలమ్ఆరా’ (1931), ‘భక్త ప్రహ్లాద’ (1932), ‘కాళిదాసు’ (1931), పెళ్లిచేసి చూడు వంటి సినిమాలతో కొత్త శకం తెచ్చారు. నిర్మాతగా ప్రసాద్ ప్రొడక్షన్స్ స్థాపించి, హైదరాబాదులో ప్రసాద్ స్టూడియోస్, ల్యాబ్స్, ఐమాక్స్ వంటి సంస్థలు నెలకొల్పి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు.
B Nagireddy
బి. నాగిరెడ్డి (1986) – సూపర్ హిట్ చిత్రాల నిర్మాత
అగ్రగామి నిర్మాత బి. నాగిరెడ్డి 1986లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన నిర్మించిన విజయ వాహిని స్టూడియో ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్టూడియోగా నిలిచింది. మాయాబజార్, పాతాళ భైరవి, గుండమ్మ కథ, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి క్లాసిక్ సినిమాలు ఆయన నిర్మాణ ప్రతిభకు నిదర్శనం. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమారంగాల్లో ఎన్నో విజయాలు అందుకున్నారు.
ANR అక్కినేని నాగేశ్వరరావు (1990) – మహానటుడు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ( ANR)1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఎన్నార్ 250కి పైగా సినిమాల్లో తన నటన ప్రతిభ చూపించి తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచారు. ధర్మపత్ని, దేవదాసు, మాయాబజార్, మొగుడు-పెళ్లాం వంటి క్లాసిక్స్లో తన ప్రతిభ చాటారు. అన్నపూర్ణ స్టూడియోస్ను స్థాపించి, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి మరపురాని సేవలు అందించారు.
Rama Naidu
డాక్టర్ డి. రామానాయుడు (2009) – గిన్నీస్ రికార్డు సాధించిన నిర్మాత
ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆయన 9 భాషల్లో 150కి పైగా సినిమాలు రూపొందించిన ఏకైక నిర్మాత రికార్డు క్రియేట్ చేశారు. సినిమా రంగానికి చేసిన సేవకు గాను ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఆయన నిర్మించిన ప్రేమనగర్, బాబాయి-అబ్బాయి, కులగౌరవం వంటి హిట్ సినిమాలు చిరస్థాయిగా నిలిచాయి. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించారు.
K Viswanath
కే. విశ్వనాథ్ (2016) – కళాతపస్వి దర్శకుడు
కళాతపస్వి కే. విశ్వనాథ్ 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల వంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించారు ఆయన. తెలుగు సినిమా స్థాయిని జాతీయస్థాయికి తీసుకెళ్లిన మహాత్ముడు కే. విశ్వనాథ్. భారతీయ సంస్కృతిని, కళలను, మానవీయ విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు మహానీయుడు.
ఈ మహనీయులు అందుకున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు తెలుగు సినిమా ప్రతిష్టను మరింత ఎత్తుకు చేర్చాయి. వారి సృజనాత్మకత, కృషి వల్లే తెలుగు పరిశ్రమకు దేశ-విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది.