- Home
- Entertainment
- Janaki: జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఏవో తెలుసా? ఏకైక లేడీ మిమిక్రీ సింగర్ గా రికార్డు..
Janaki: జానకి మగ గొంతుతో పాడిన పాటలు ఏవో తెలుసా? ఏకైక లేడీ మిమిక్రీ సింగర్ గా రికార్డు..
Janaki: కోట్లాది సంగీత అభిమానులను విషాదంలో ముంచి గాయని ఎస్ జానకి అస్తమించారు. ఆమె గానామృతధార ఎన్ని తరాలు మారినా కురుస్తూనే ఉంటుంది. జానకి గాత్రం సృష్టించిన రికార్డులెన్నో ఉన్నాయి.

మూగబోయిన గాన కోకిల..
ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండియన్ లెజెండరీ సింగర్, ఎస్ జానకి సంగీత అభిమానులను విషాదంలోకి నెట్టేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించి జానకి కెరీర్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. గాయని మాత్రమేకాకుండా పాటల మిమిక్రీతో ప్రత్యేకతను చాటుకున్నారు జానకమ్మ. గానకోకిల ఎస్. జానకి (శిష్ట్లా జానకి) భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక అద్భుతం. ఆమె కేవలం మధురమైన గొంతుతోనే కాకుండా, పసిపిల్లల గొంతు నుండి ముసలివారి గొంతు వరకు, పశుపక్షాదుల శబ్దాల నుండి మగ గొంతు వరకు దేనికైనా ప్రాణం పోయగల అద్భుత స్వర విన్యాసకురాలు.
మగ గొంతుతో పాడిన అద్భుతమైన పాట
జానకమ్మ కెరీర్లో అత్యంత విలక్షణమైన ప్రయోగం ఆమె 'మగ గొంతు'తో పాడటం. 1970లో వచ్చిన 'సిఐడి రాజు' అనే తెలుగు సినిమాలో "నన్ను చూసి అంతగాన నవ్వుకునేవెందుకు" అనే పాటను ఆమె పూర్తిగా ఒక పురుషుడి గొంతుతో పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. శోభన్ బాబు తెరపై ఒక ముసలి మగవాడి వేషంలో కనిపించే ఈ పాటలో, జానకి గారు తన సహజమైన ఆడ గొంతును పూర్తిగా మార్చి, బేస్ వాయిస్తో అచ్చం ఒక పురుషుడు పాడినట్లే పాడారు. ఈ పాట విన్నెవరైనా అది జానకి గారు పాడారంటే నమ్మడం కష్టం. ఆమెకున్న అసాధారణ స్వర నియంత్రణకు (Voice Modulation) ఈ పాట ఒక నిలువెత్తు నిదర్శనం.
సంసార సంగీతం సినిమా పాట
1989లో విడువైన ‘సంసార సంగీతం’ చిత్రంలో టి.రాజేందర్తో కలిసి ఆయన కుమారుడు సింబు కూడా నటించాడు. ఈ చిత్రానికి సంగీతం కూడా టి.రాజేందర్ అందించారు. తన కుమారుడి కోసమే ఆయన ప్రత్యేక శ్రద్ధతో ‘ఐ యామ్ ఏ లిటిల్ స్టార్’ పాటను కంపోజ్ చేశారు. ఆ పాటలో ‘ఐ యామ్ ఏ లిటిల్ స్టార్... ఆవే నేను సూపర్ స్టార్’ అంటూ చిన్న పిల్లవాడి గొంతుతో చాలా అందంగా పాడినట్లు వినిపిస్తుంది. సింబు కోసం ఆ పాట పాడింది మరెవరో కాదు, గాయని జానకి తన గొంతును మార్చుకుని చిన్న పిల్లవాడిలా పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా పురుష గాత్రంలో ఆమె పాడిన ఈ పాట అన్ని వర్గాల ప్రజలను అలరించింది. సింబుకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన పాటగా కూడా ఇది నిలిచింది. సింబుతో పాటు బాలనటిగా నటించిన షాలిని సినిమాలకు కూడా గాయని ఎస్.జానకి చిన్న పిల్లల గొంతుతో పాడి అలరించింది.
జానకమ్మ గాన ప్రయాణం..?
ఎస్. జానకి గారు తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా వంటి దాదాపు 17కి పైగా భాషల్లో 50 వేల వరకూ పాటలు పాడారు. ముఖ్యంగా దక్షిణ భారత భాషల్లో ఆమె పాడని రాగం లేదు, తాకని గుండె లేదు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాలతో ఆమె కాంబినేషన్ భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. జానకి తెలుగువారిగా పుట్టడం తెలుగువారందరు చేసుకున్న అదృష్టం.

