S Janaki: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూత
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. ఎస్ జానకి మధుర గానం గురించి తెలియనివారు, ఆమె పాటలు వినని వారు ఉండరు.

లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. ఎస్ జానకి మధుర గానం గురించి తెలియనివారు, ఆమె పాటలు వినని వారు ఉండరు. శనివారం రోజు ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
జానకి మరణానికి కారణం
వృద్ధాప్య సమస్యలతో ఆమె మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె మనవరాలు అప్సర విధ్యుల సోషల్ మీడియాలో ప్రకటించారు. ఎస్ జానకి పూర్తి పేరు సిస్ట్ల శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న జానకి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జన్మించారు. 1957 నుంచే సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు. 60 ఏళ్ళ కెరీర్ లో ఆమె 48 వేలకు పైగా పాటలు పాడారు. అలాంటి లెజెండ్రీ సింగర్ కన్ను మూయడంతో సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
నాలుగు జాతీయ అవార్డులు
దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఆమె వేలాది పాటలు ఆలపించారు. తన మధురమైన గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న జానకి, భారతీయ సినీ సంగీత చరిత్రలో అత్యంత గొప్ప గాయనిలలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన అద్భుతమైన గాన ప్రతిభకు గుర్తింపుగా ఎస్ జానకి నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను అందుకున్నారు.
పద్మభూషణ్ అవార్డు రిజెక్ట్ చేసిన జానకి
పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దానిని ఆమె తిరస్కరించడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.పద్మ భూషణ్ అవార్డుకి తనని చాలా ఆలస్యంగా గుర్తించారని, తాను అత్యున్నత పురస్కారం భారతరత్నకి అర్హురాలిని అని జానకి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను అనేక సంస్థలు ఆమెను ఘనంగా సత్కరించాయి.
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
ఎస్ జానకి మరణవార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమెకు నివాళులు అర్పిస్తూ, భారతీయ సంగీత ప్రపంచానికి ఇది తీరని లోటు అని పేర్కొంటున్నారు. ఆమె ఆలపించిన ఎన్నో అమర గీతాలు తరతరాల పాటు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

