`దేవర` విషయంలో `బాహుబలి` స్ట్రాటజీ ప్లే చేస్తున్న కొరటాల శివ.. ఎన్టీఆర్ని అలా చూపించబోతున్నాడా?
ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. భారీ స్థాయిలో కొరటాల శివ దీన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీ విషయంలో దర్శకుడు `బాహుబలి` స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట.
`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ `దేవర`. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుంది. సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. రెండు భాగాలుగా దీన్ని తీసుకొస్తున్నారు దర్శకుడు కొరటాల. సినిమా స్కేల్ భారీగా పెరగడం, కథ ఒక పార్ట్ లో చెప్పలేకపోవడంతో రెండు భాగాలుగా చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో జాన్వీ కపూర్ ఎన్టీఆర్కి జోడీగా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు సైన్ టామ్ చాకో మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
`దేవర` సినిమాలో తారక్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారని సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. తండ్రీ కొడుకులుగా తారక్ కనిపిస్తారట. దీనికి సంబంధించి టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నారని, `బాహుబలి` స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ స్ట్రాటజీ ఏంటనేది చూస్తే..
`బాహుబలి`లో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేశారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా కనిపించారు. తండ్రి కొడుకుల కథగా చెప్పారు. తండ్రి వీరోచిత పోరాటం, తల్లి, సోదరుడు కలిసి చేసిన కుట్ర, దాన్ని కొడుకు ప్రతీకారం తీర్చుకోవడమనే కథతో రూపొందింది. అయితే మొదటి భాగంలో కొడుకు పాత్ర ప్రధానంగా నడిపించారు. తండ్రి పాత్ర హింట్ ఇచ్చి, రెండో భాగంలో మెయిన్గా చూపించారు. శక్తివంతమైన తండ్రి పాత్రని రెండో పార్ట్ లో చూపించారు.
ఇప్పుడు `దేవర` విషయంలోనూ అదే చేస్తున్నారట. దేవర కూడా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. ఇందులోనూ ఎన్టీఆర్ని తండ్రీ కొడుకులుగా చూపిస్తున్నారు. అయితే మొదటి భాగంలో కొడుకు పాత్ర ప్రధానంగా చూపిస్తారని, రెండో భాగంలో శక్తివంతమైన తండ్రి పాత్రని చూపిస్తారని తెలుస్తుంది.
సముద్రం నేపథ్యంలో పోర్ట్ ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని సమాచారం. పోర్ట్ ని తండ్రి నిర్మిస్తే, ప్రత్యర్థులు కుట్ర చేసి స్వాధీనం చేసుకుంటారు. తండ్రి పాత్రని చంపేస్తారు. ఆ తర్వాత కొడుకు వచ్చి వారిపై ప్రతీకారం తీర్చుకుని మళ్లీ ఆ పోర్ట్ ని తన వశం చేసుకోవడమే `దేవర` కథ అని తెలుస్తుంది.
`బాహుబలి` లాగే `దేవర` స్క్రీన్ ప్లే నడుస్తుందని, అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ లు వేరు, కానీ బేసిక్ లైన్ మాత్రం ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇక `దేవర` షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్కిది తొలి సోలో పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో తన సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు తారక్. ఏ రేంజ్లో ఆదరణ పొందుతుందో చూడాలి.