`బ్రో` ట్రైలర్ ఈవెంట్లో కేతిక స్పెషల్ ఎట్రాక్షన్.. ఇది శాంపుల్ మాత్రమే, సినిమాలో అసలు మజా అంటోన్న తమన్
హైదరాబాద్లో జరిగిన `బ్రో` ట్రైలర్ ఈవెంట్లో హాట్ బ్యూటీ, హీరోయిన్ కేతిక శర్మ పాల్గొంది. టీమ్తోపాటు కలిసి సందడి చేసింది. కానీ ఈవెంట్లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్గా నిలవడం విశేషం.
`బ్రో` మూవీ ట్రైలర్ ఈవెంట్ ఇటు హైదరాబాద్లో, అటు వైజాగ్ లో ఏకకాలంలో జరిగింది. హైదరాబాద్లో దేవీ థియేటర్లో దర్శకుడు సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరోయిన్ కేతిక శర్మ, నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు. ఇందులో కేతిక శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దేవి థియేటర్లో ట్రైలర్ ఈవెంట్కి భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో హాట్ మొత్తం నిండిపోవడంతోపాటు బయటకు కూడా కిక్కిరిసిపోయారు. అభిమాన తారలను చూసేందుకు వారంతా ఎగబడ్డారు. వందల మంది కోలాహలం మధ్య `బ్రో` మూవీ ట్రైలర్ని విడుదల చేశారు. దీనికి వారి నుంచి మంచిస్పందన రావడం విశేషం. అరుపులు ఈలలతో హోరెత్తించారు. దీంతో థియేటర్లు మార్మోగిపోయాయి.
మరోవైపు వైజాగ్లోనూ అలాంటి స్పందనే ఎదురయ్యింది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, మీ ప్రేమ పొందటం కోసమే ఇంత దూరం వచ్చాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం సంతోషంగా ఉంది. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అభిమానులకి ఏమైనా జరిగితే మేం తట్టుకోలేము అన్నారు. అలాగే "నాకు కొంచెం తిక్కుంది" అంటూ తన మేనమామ పవన్ కళ్యాణ్ ఫేమస్ డైలాగ్ ని చెప్పి అభిమానుల్లో ఉత్సాహం నింపారు సాయి ధరమ్ తేజ్. `ట్రైలర్ మిమ్మల్ని ఎంతగా అలరించిందో, దానికి వంద రెట్లు సినిమా అలరిస్తుంద`ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు.
హైదరాబాద్ ఈవెంట్లో సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. "చాలా మంచి సినిమా ఇది. సినిమా ఫలితం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మీరు దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ గారు దేవుడిగా నటించిన సినిమా ఇది. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది." అన్నారు.
ఈ సినిమా కోసం అందరిలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లి ఆనందించదగ్గ చిత్రమిదని కథానాయిక కేతిక శర్మ అన్నారు.
ట్రైలర్ కేవలం శాంపిల్ మాత్రమే అని, సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉంటాయని, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని సంగీత దర్శకుడు థమన్ అన్నారు.
`బ్రో` ట్రైలర్ విషయానికి వస్తే.. తనకు జీవితంలో దేనికీ సమయం లేదంటూ ప్రతి దానికి కంగారు పడుతూ ఇంట్లోనూ, పని దగ్గర హడావుడిగా ఉండే సాయి ధరమ్ తేజ్ పాత్రని చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కేతికా శర్మ అతని ప్రేయసిగా కనిపిస్తుంది. ఒక దుర్ఘటన, సమయానికి ప్రాతినిధ్యం వహించే పవన్ కళ్యాణ్ రాక తర్వాత, అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్గా, కూలీగా(తమ్ముడు చిత్రంలోని లుక్ ఆధారంగా) విభిన్న అవతారాల్లో కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ అతని నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. పవన్ కళ్యాణ్ ఎంతో సరదాగా గడుపుతుండగా, సాయి ధరమ్ తేజ్ మాత్రం గందరగోళంగా, కలవరపడుతున్నట్లు కనిపిస్తాడు. వారు ఎప్పుడూ కలిసి ఎందుకు కనిపిస్తారని చాలామంది ఆశ్చర్యపోతారు.
సాయిధరమ్ తేజ్కి గతంలోకి వెళ్లే అరుదైన అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం మరియు జీవితం, మరణం గురించి చెప్పిన మాటలు కట్టిపడేస్తున్నాయి. ఇందులో ఎమోషన్, కామెడీ, భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ని ఆందోళనకు గురి చేసేలా అతని కుటుంబం చుట్టూ సంఘర్షణ జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కింగ్ సినిమాలోని బ్రహ్మానందం యొక్క ఐకానిక్ డైలాగ్ను పవన్ కళ్యాణ్ రీక్రియేట్ చేయడం, జల్సా స్టెప్ వేయడం మరియు సాయి ధరమ్ తేజ్ తో కలిసి కాలు కదపడం వంటి అందమైన మూమెంట్స్ తో ట్రైలర్ ను ముగించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. అలాగే తనకు లిప్స్టిక్ రుచి కూడా తెలియదని పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ చెప్పడం నవ్వులు పూయించింది.
డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఈ చిత్రం ప్రేక్షకులకు వింటేజ్ పవన్ కళ్యాణ్ని గుర్తు చేస్తుంది. సముద్రఖని కథ విషయంలో రాజీ పడకుండా అభిమానులను మెప్పించేలా సినిమాను అద్భుతంగా రూపొందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కి ప్రధాన బలంగా నిలిచాయి.
జూలై 28న ప్రేక్షకుల కోసం వినోదభరితమైన విందు ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ కనిపిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వీ రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా, సూర్య శ్రీనివాస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.