Keerthy Suresh: `మహానటి`లో కీర్తిసురేష్ కంటే ముందు ఆ హీరోయిన్ని అనుకున్నారట.. కండీషన్స్ పెట్టడంతో..
కీర్తిసురేష్కి మహానటిగా నిలబెట్టిన చిత్రం `మహానటి`. సావిత్రి జీవితం ఆధారణంగా రూపొందిన ఈ చిత్రంలో మొదట మెయిన్ లీడ్కి కీర్తిసురేష్ ని కాకుండా మరో హీరోయిన్ వద్దకు వెళ్ళిందట. కానీ ఆమె కండీషన్స్ పెట్టడంతో అంతా మారిపోయిందట.
మహానటి సావిత్రి(Savitri) జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం `మహానటి`(Mahanati). ఈ సినిమాతో కీర్తిసురేష్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. నేటి తరానికి `మహానటి` సావిత్రి అంటే కీర్తిసురేషే(Keerthy Suresh) అనే ముద్ర వేసింది కీర్తిసురేష్.ఈ సినిమాలోని తన నటనకు గానూ ఏకంగా జాతీయ అవార్డుని కూడా అందుకుంది. అనేక పురస్కారాలను అందుకుందీ సినిమా.
అంతేకాదు ఈ చిత్రంతోనే తెలుగులో అగ్ర నిర్మాతగా రాణించిన అశ్వినీదత్ పూర్వ వైభవాన్ని పొందారు. వరుస పరాజయాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రభాస్తో ఏకంగా `ప్రాజెక్ట్ కే` చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అశ్వినీదత్(Ashwini dutt) ఓ షోలో పాల్గొని `మహానటి` గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తాను నిర్మించిన `స్టూడెంట్ నెం 1`లో హీరోగా ముందుగా ఎన్టీఆర్కి బదులు ప్రభాస్ అనుకున్నట్టు చెప్పారు. హరికృష్ణ ఫోన్ చేయడంతో ఎన్టీఆర్ని పరిచయం చేసేందుకు అంగీకరించినట్టు చెప్పారు. అలాగే `మహానటి` సినిమా వెనకాల ఉన్న సీక్రెట్ని కూడా బయటపెట్టారు. కీర్తిసురేష్కి బదులు మరో హీరోయిన్ని అనుకున్నారట. సావిత్రి పాత్రలో మరో మలయాళ నటిని అనుకున్నట్టు తెలిపారు.
అశ్వినీదత్ చెబుతూ, `మహానటి` చిత్రంలో మొదట ఓ మలయాళ హీరోయిన్ని అనుకున్నాం. ఆమె ఓకే చెప్పింది. కథ చెప్పాక మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండీషన్స్ పెట్టిందట. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ చర్చలు జరుపుతున్న సమయంలో ఈ విషయం తెలిసిన నిర్మాత అశ్వినీదత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హీరోయిన్ని తీసుకోవడానికి వీల్లేదని చెప్పారట.
దీంతో `మహానటి` కీర్తిసురేష్ వద్దకి వెళ్లిందని చెప్పారు. అయితే తాను వద్దని చెప్పిన కథానాయిక పేరు చెప్పేందుకు అశ్వినీదత్ మాత్రం నిరాకరించారు. దీంతో ఎవరనేది ఆరా తీయడం స్టార్ట్ అయ్యింది. అయితే `మహానటి` ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు నిత్యా మీనన్(Nithya Menon).. సావిత్రి పాత్రలో నటించబోతుందనే పుకార్లు వినిపించాయి. కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చాయి. మరి అశ్వినీదత్ చెప్పిన ఆ మలయాళ హీరోయిన్ నిత్యా మీననేనా? అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఇదే నిజమైతే నిత్యా మీనన్ ఓ గొప్ప చిత్రాన్ని మిస్ అయ్యిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే బాలకృష్ణ నటించిన `ఎన్టీఆర్ః కథానాయకుడు` చిత్రంలో మాత్రం సావిత్రి పాత్రని నిత్యామీనన్ నటించడం విశేషం. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ రూపొందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్గా బాలకృష్ణ నటించిన విషయం తెలిసిందే. నిత్యా మీనన్ పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు. పైగా సినిమా కూడా పరాజయం చెందడంతో అంతా నిరాశ చెందారు.