కరణ్, ఉద్దవ్... వచ్చి నా శరీరాన్ని కూడా ఛిద్రం చేయండి..!
హీరోయిన్ కంగనా రనౌత్ కార్యాలయాన్ని బ్రాహ్మణ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది. అధికారులు కంగనా రనౌత్ కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఈ ఘటనపై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చావైనా, బ్రతుకైనా మీ అన్యాయాలను బయటపెడతా అని కంగనా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
కొద్దిరోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనా రనౌత్ కి మధ్య వివాదం నడుస్తుంది. శివసేన నేతలు, పార్టీ వర్గాలు కంగనా పై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. బాలీవుడ్ పై కంగనా రనౌత్ డ్రగ్స్ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. 99శాతం బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వాడుతారని, డ్రగ్ కల్చర్ అధికంగా ఉందని ఆమె ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై స్పందించిన మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ కంగనాపై డ్రగ్స్ ఆరోణపణలు చేశారు. కంగనా డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు ఉన్నాయని, ఓ వ్యక్తితో పాటు ఆమె డ్రగ్స్ సేవించినట్లు ఆమె స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. దీనికి స్పందిస్తూ కంగనా నేను పరీక్షలు, విచారణకు సిద్ధం...డ్రగ్స్ వాడినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.
శివసేనకు, కంగనాకు మధ్య వాడివేడి యుద్ధం నడుస్తుండగా ఆమె ముంబైలో అత్యంత భద్రత మధ్య అడుగుపెట్టారు. ఐతే బ్రాహ్మిణ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంగనా కార్యాలయాన్ని నేడు ధ్వంసం చేశారు. ఈ కూల్చివేత ఆపివేయాలంటూ హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా నేలమట్టం చేయకుండా ఆపివేశారు.
దీనికి నిరసన తెలియజేస్తూ కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా సీఎం ఉద్ధవ్ ఠాక్రేను సూటిగా ప్రశ్నించారు. 'ఉద్దవ్, కరణ్ గ్యాంగ్ కలిసి నా ఆఫీస్ నాశనం చేశారు. వచ్చి నా ఇంటిని కూడా కూల్చి వేయండి, ఆ తరువాత నా శరీరాన్ని కూడా ఛిద్రం చేయండి. నిస్సహాయులను మీరు ఎంతగా అణగదొక్కుతారో లోకం చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. చావైనా, బ్రతుకైనా మీ అన్యాయాలను బయటపెడతా' అని కంగనా ట్వీట్ చేయడం జరిగింది.
ఈ విషయంలో కంగనాకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఆమెకు పలువురు బాసటగా నిలిచారు. మరో వైపు మహారాష్ట్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళపై ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యకు దిగడం సరికాదని అందరూ అంటున్నారు.