కమల్ రాయల్ ఎంట్రీ అదుర్స్.. పూజా, తమన్నా, దీపికా, ఐశ్వర్య, రెహ్మాన్ కేన్స్ లో ఇండియన్ తారల రచ్చ
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కేన్స్ లో ఇండియన్ తారలు సందడి చేశారు. ముఖ్యంగా ఈ సారి తెలుగు తారలు రచ్చ చేయడం విశేషం. ఇక కమల్ రాయల్ ఎంట్రీ కేన్స్ లో హైలైట్గా నిలిచింది.
ఎప్పుడైనా కేన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్లు మాత్రమే సందడి చేసేవారు. రెడ్ కార్పెట్పై కనువిందు చేసేవారు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి వారు పాల్గొనేవారు. కానీ ఈ సారి ఫస్ట్ టైమ్ సౌత్ యాక్టర్స్, ముఖ్యంగా టాలీవుడ్ యాక్టర్స్ సందడి చేయడం విశేషం. కేన్స్ లో ఇండియాకి దక్కిన గౌరవంగా దీన్ని చూడొచ్చు.
75వ కేన్స చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్ దేశంలోని కాన్స్ నగరంలో మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈసారి వేడుకల్లో మన దేశం నుంచి ఏఆర్ రెహమాన్, శేఖర్ కపూర్, మాధవన్, నవాజుద్దిన్ సిద్ధిఖి, తమన్నా, పూజా హెగ్డే, ఊర్వశి రౌతేలా, హినా ఖాన్ వంటి.. ఇలా పలువురు తారలు పాల్గొన్నారు.
అయితే ఈ సారి కేన్స్ లో ఇండియాకి ప్రత్యేకమైన స్థానం దక్కింది. ఇండియా సినిమా గర్వించే స్థాయికి ఎదిగిన నేపథ్యంలో `ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా` పేరుతో ప్రత్యేకంగా లాబీ ఏర్పాటు చేశారు. అక్కడ ఇండియన్ సినిమా గొప్పతనం చెప్పే అవకాశం దక్కింది.
అయితే ఇందుకోసం ప్రత్యేకంగా భారత ప్రభుత్వం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సారథ్యంలో ఇండియన్ సినీ ప్రముఖులు హాజరు కావడం విశేషం. అనురాగ్ టీమ్లో నవాజుద్దిన్ సిద్ధిఖీ, మాధవన్, దర్శకుడు, నటుడు శేఖర్ కపూర్, సంగీత దర్శకుడు రిక్కీ కేజ్, సీబీఎఫ్సి (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) చైర్ పర్సన్ ప్రసూన్ జోషి, సీబీఎఫ్సి సభ్యురాలు వాణీ త్రిపాఠి, ఆస్కార్ విన్నర్ రెహ్మాన్ పాల్గొన్నారు. వీరితోపాటు అక్షయ్ కుమార్ కూడా హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యింది.
ఇందులో కమల్ హాసన్ ఎంట్రీ అందరికంటే హైలైట్గా నిలిచింది. ఆయన ప్రత్యేకమైన హెలికాప్టర్ ద్వారా కేన్స్ వేదిక వద్దకు అడుగుపెట్టడం విశేషం. ఇది ఇండియన్ సినిమాకి దక్కిన గౌరవంగా చెప్పొచ్చు. లోకనాయకుడు ఎంట్రీ రాయల్ తరహాలో ఉండటం విశేషం. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే కమల్ హాసన్ తాను నటిస్తున్న `విక్రమ్` సినిమా ట్రైలర్ ఎన్ఎఫ్టీని కేన్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఇండియన్ సినిమా ట్రైలర్ కేన్స్ లో ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
మరోవైపు కేన్స్ వేడుకలో ఇండియన్ ముద్దుగుమ్ములు సందడి చేస్తున్నారు. ఇప్పటికే రెడ్ కార్పెట్లో దీపికా పదుకొనె హోయలు పోయింది. ఇండియన్ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే శారీలో ఆమె కేన్స్ రెడ్ కార్పెట్పై మెరవడం విశేషం. అలాగే బ్లాక్ డ్రెస్లో ఇండియన్ లాబీలో మాట్లాడారు. పూజా, తమన్నా, హినా ఖాన్లతో కలిసి స్టెప్పలేశారు.
అలాగే తమన్నా సైతం కేన్స్ ఆవరణ బయట ట్రెండీ వేర్లో ఫోటో షూట్కి పోజులిచ్చింది. ఆమె కూడా రెడ్ కార్పెట్పై సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఫస్ట్ టైమ్ మిల్కీ బ్యూటీ కేన్స్ లో కనువిందు చేయబోతుందని చెప్పొచ్చు.
ఆమెతోపాటు మరో టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా సందడి చేయనుంది. ఆమె ఈ సాయంత్రం రెడ్కార్పెట్పైకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఐశ్వర్య రాయ్ సైతం రెడ్ కార్పెట్ కోసం ముస్తాబవుతుంది. ఇప్పటికే ఆమె కేన్స్ లో అడుగుపెట్టి కనువిందు చేస్తుంది. దాదాపు 20సార్లు ఐష్ కేన్స్ లో సందడి చేయడం విశేషం.
ఈ నెల(మే) 17న ప్రారంభమైన ఈ 75వ కేన్స్ చిత్రోత్సవాలు ఈ నెల 28 వరకు 12 రోజులపాటు జరుగుతాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సినీ ప్రముఖలు, సినిమాలు ఇందులో ప్రదర్శించబడతాయి. ఆయా దేశాలు తమ సినిమా కల్చర్ని, తమ దేశ కల్చర్ని ఆవిష్కరిస్తారు. మారుతున్న ట్రెండ్,సినిమాలో వస్తోన్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఇలాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికగా నిలవబోతుండటం విశేషం.