ఎన్టీఆర్ కొత్త లుక్పై రూమర్స్, అసలు కారణం ఇదే.. తారక్ ఆ పాత్రలో కనిపిస్తాడా?
ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ప్రశాంత్ నీల్ మూవీలో బిజీగా ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. దీనికి `డ్రాగన్` అనే పేరుని పరిశీలిస్తున్నారట. ఆల్మోస్ట్ ఇదే కన్ఫమ్ అయ్యే అవకాశం ఉంది.
ఇది ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఉంటుందని, దాని స్కేల్, రేంజ్ వేరే స్థాయిలో ఉంటుందని ఆ మధ్య నిర్మాత రవి శంకర్ తెలిపారు.
సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుందన్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఎన్టీఆర్ లుక్ చర్చనీయాంశం
ఇదిలా ఉంటే ఇందులో ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ అయినట్టు సమాచారం. అయితే తాజాగా తారక్ లుక్ చర్చనీయాంశం అవుతుంది. ఆ మధ్య ఎయిర్పోర్ట్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు తారక్. చాలా సన్నగా మారిపోయారు.
అంతకు ముందు కళ్యాణ్ రామ్ సినిమా `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కనిపించారు. అప్పుడు కూడా సన్నగా ఉన్నారు. కానీ ఇప్పటికంటే బెటర్గానే ఉన్నారు.
ఎన్టీఆర్ లుక్పై ఫ్యాన్స్ ఆందోళన
కోట శ్రీనివాసరావు మరణించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు తారక్. ఆదివారం సాయంత్రం ఆయన కోట ఫ్యామిలీ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తన ప్రగాఢ సానుభూతిని వెల్లడించారు. కోట మరణం తీరని లోటు అన్నారు. కోట సినిమాలను సెలబ్రేట్ చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ అని నినాదాలు చేయగా, జై కోట శ్రీనివాసరావు అంటూ నినాదాలు చేయాలని తెలపడం విశేషం.
అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ బరువు తగ్గి బాగా సన్నగా కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తారక్కి ఏమైంది? అంటూ ఆరా తీస్తున్నారు. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అని ఆందోళన చెందుతున్నారు.
`డ్రాగన్` కథ ఇదేనా ?
కానీ ఈ ఎన్టీఆర్ లుక్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసమే అని తెలుస్తోంది. సినిమాలోని పాత్ర కోసమే తారక్ ఇలా బరువు తగ్గారని సమాచారం. ఈ మూవీ బెంగాల్ నేపథ్యంలో 1960-70 బ్యాక్ డ్రాప్లో సాగుతుందని, ఇందులో ఎన్టీఆర్ మాఫియా డాన్గా కనిపిస్తారట.
అప్పటి రాజకీయ నాయకులకు చెమటలు పట్టించే గ్యాంగ్ స్టర్గా తారక్ కనిపిస్తారని, రాజకీయ నేపథ్యం సినిమాలో హైలైట్గా ఉంటుందని తెలుస్తోంది. అప్పటి రాజకీయ అల్లర్లు కూడా ఇందులో చూపించబోతున్నట్టు సమాచారం.
ఇంకోవైపు థాయ్ లాండ్, మయన్మార్ వంటి ప్రాంతంలో విస్తరించి ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని శాసించిన చైనీస్ గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ జావో వీ జీవిత కథని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే వార్త వినిపిస్తోంది.
`డ్రాగన్` కోసమే ఎన్టీఆర్ ఇలా
దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, మాఫియా నేపథ్యం ఇందులో హైలైట్గా నిలుస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, గతంలో ఎప్పుడూ ఆయన్ని ఇలా చూసి ఉండరని టాక్.
ఆ పాత్ర కోసమే తారక్ని వెయిట్ తగ్గాలని చెప్పారట. ప్రశాంత్ నీల్ సూచన మేరకే ఎన్టీఆర్ ఇలా వెయిట్ తగ్గారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది.

