ఇండియన్ 2 వివాదం.. కమల్, లైకాని బ్లేమ్ చేస్తున్న శంకర్..రంగంలోకి విశ్వనటుడు ?
ఇండియన్ 2 వివాదం రోజు రోజుకి మరింతగా పెద్దదవుతుంది. సినిమా ఆగిపోవడానికి నిర్మాణ సంస్థ లైకా, నటుడు కమల్ అని శంకర్ అన్నారు. దీంతో ఎట్టకేలకు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ రంగంలోకి దిగుతున్నారు.
కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన `భారతీయుడు` సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. అప్పట్లోనే ఇది 50కోట్లు వసూలు చేసి సౌత్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. అవినీతికి వ్యతిరేకంగా రూపొందిన ఈ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. సేనాపతి(భారతీయుడు)గా వృద్ధుడి గెటప్లో కమల్ నట విశ్వరూపం చూపించారు.
తాజాగా దాదాపు 25ఏళ్ల తర్వాత ఈ సినిమాని తెరకెక్కించాలని భావించారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమాని ప్రకటించారు. కమల్ హీరోగా,శంకర్ ఈ సినిమాని నిర్మించబోతుండగా, లైకా సంస్థ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి అన్నీ అవాంతరాలే ఎదురయ్యాయి. మొదట కమల్కి మేకప్ ఎలర్జీతో బాధపడ్డారు. అది సెట్ అయ్యాక ఆయనకు గాయం కావడం, దాన్నుంచి కోలుకున్నాక షూటంగ్లో క్రేన్ మీద పడి ముగ్గురు సిబ్బంది చనిపోవడం, అది కూడా సెట్ అయ్యాక కరోనా ప్రభావం వంటి సమస్యలు చుట్టు ముట్టాయి.
కరోనా ప్రభావం తగ్గి అన్ని సినిమాలు ప్రారంభమయ్యాయి. కానీ `ఇండియన్ 2` ఆగిపోయింది. ఈ లోపే దర్శకుడు శంకర్ తెలుగులో రామ్చరణ్తో ఓ సినిమాని ప్రకటించారు. అలాగే హిందీలో రణ్వీర్ సింగ్తో `అపరిచితుడు` రీమేక్ ప్రకటించారు. దీంతో చిర్రెత్తిపోయిన నిర్మాణ సంస్థ లైకా కోర్ట్ మెట్లు ఎక్కింది. తమ సినిమా పూర్తయిన తర్వాతే మిగిలిన షూటింగ్లు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోర్టుని అభ్యర్థించింది.
దీనిపై స్పందించిన కోర్టు ఈ విషయంపై శంకర్ వివరణ కోరింది. దీనికీ ఆయన స్పందిస్తూ, కమల్ డేట్స్ వల్లే ఆలస్యమవుతుందని వివరణ ఇచ్చాడు. కమల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు. దీనిపై కోర్టు అందరు కూర్చొని సామరస్యంగా చర్చించుకుని ఓ నిర్ణయానికి రండి అని కోర్టు చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు.
మరోసారి శంకర్ దీనిపై చెబుతూ, `ఇండియన్2` చిత్రాన్ని తొలుత దిల్రాజు నిర్మించడా నికి సిద్ధమయ్యారని, కానీ తామే నిర్మిస్తామని లైకా సంస్థ ముందుకొచ్చిందని చెప్పారు. దీంతో 2018 మేలో మొదలెట్టినట్లు, చిత్రానికి రూ.270 కోట్లు బడ్జెట్ అవుతుందని, చివరికి రూ.250 కోట్లకు కుదించినా షూటింగ్ను ప్రారంభించడానికి జాప్యం చేశారన్నారు. ఆ తరువాత నటుడు కమలహాసన్కు మేకప్ అలర్జీ, చిత్రీకరణ సమయంలో క్రేన్ విపత్తు, లాక్డౌన్తో షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు. సాంకేతిక నిపుణులకు నగదు చెల్లించకపోవడంతో వారు ఇతర చిత్రాలలో నటించడానికి వెళ్లిపోయారన్నారు.
ఇక ఈ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండటం, వివాదం మరింత పెద్దదవడంతో కమల్ రంగంలోకి దిగబోతున్నారట. ఆయన లైకా సంస్థ నిర్మాత సుభాస్కరన్ టీమ్, అలాగే దర్శకుడు శంకర్తో విడివిడిగా మాట్లాడాలని, ఆ తర్వాత ఇద్దరితో కలిసి మాట్లాడేందుకు చర్యలు చేపట్టారట. ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని, పెద్దరికం తీసుకుని వివాదాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ని తిరిగి ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారట.
ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, సముద్రఖని, వెన్నెల కిశోర్, మనోబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే కమల్ ప్రస్తుతం `విక్రమ్` సినిమాలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకుడు.