- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్కే కథ చెప్పలేదు, ఎన్టీఆర్కి తెలియడంలో మీ ఇంట్రెస్ట్ ఏంటి?.. రిపోర్టర్పై వైవీఎస్ చౌదరి ఫైర్
పవన్ కళ్యాణ్కే కథ చెప్పలేదు, ఎన్టీఆర్కి తెలియడంలో మీ ఇంట్రెస్ట్ ఏంటి?.. రిపోర్టర్పై వైవీఎస్ చౌదరి ఫైర్
దర్శకుడు వైవీఎస్ చౌదరి చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి నాల్గో తరం వారసుడు ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్లో రిపోర్టర్పై ఆయన ఫైర్ అయ్యాడు.

ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్గా రాణించారు. మహేష్ బాబుతో యువరాజు, నాగార్జునతో `సీతారామరాజు`, రామ్తో `దేవదాస్`, బాలకృష్ణతో `ఒక్క మగాడు`, సాయిధరమ్ తేజ్ తో `రేయ్`, హరికృష్ణతో `సీతయ్య`, `టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్`, `లాహిరి లాహిరి లాహిరిలో` వంటి సినిమాలు చేశాడు. `రేయ్` మూవీ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. ఆ సినిమా డిజాస్టర్గా నిలవడంతో వైవీఎస్ చౌదరి సినిమాలు మానేశాడనే టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడిని పరిచయం చేయబోతున్నారు. హరికృష్ణ మనవడు, జానకీరామ్ కొడుకు ఎన్టీఆర్(నందమూర తారకరామారావు)ని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు. ఇది నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఆయన సీనియర్ ఎన్టీఆర్, జూ ఎన్టీఆర్ ఉన్నారు, కొత్తగా వస్తున్న హీరోకి ఏం పేరు పెట్టబోతున్నారనే ప్రశ్నకి కాలమే నిర్ణయిస్తుందని, ఆయన నటన, సినిమాలను బట్టి ఏ పేరు పెట్టాలనేది తెలుస్తుందని, నెట్వర్క్, మేధావులు నిర్ణయిస్తారని, ప్రస్తుతానికి తాను ఆయన ఒరిజినల్ నేమ్తోనే సినిమా చేస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా రిపోర్టర్పై వైవీఎస్ చౌదరి ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న సినిమా కథ వాళ్ల ఫ్యామిలీకి తెలుసా? అనే ప్రశ్నకి ఆయన ఫైర్ అయ్యారు. తాను `సీతారాముల కళ్యాణం` సినిమాకి నాగార్జునకి తప్ప ఇప్పటి వరకు మరే హీరోకి కథ చెప్పలేదని తెలిపారు. తనపై నమ్మకంతోనే సినిమాలు చేశారని వెల్లడించారు. సాయిధరమ్ తేజ్తో `రేయ్` సినిమా చేసే సమయంలోనూ పవన్ కళ్యాణ్కి కూడా తాను కథ చెప్పలేదని, పవన్, హరికృష్ణ లు కూడా తమకు కథ చెప్పాల్సిన పనిలేదు, నీ పై నమ్మకం ఉందని చెప్పారని, ఎవరికి కథ చెప్పకుండానే సినిమాలు చేశానని తెలిపారు వైవీఎస్ చౌదరి.
ఇది కథ అని తాను చెప్పలేదని, పాయింట్ చెబితేనే సినిమాలు చేస్తామని హీరోలుగానీ తనని అడగలేదని వెల్లడించారు. జానకీ రామ్ కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ల ఫ్యామిలీకి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారికి కథ చెప్పారా? ఈ కథ తెలుసా అనే ప్రశ్నకి అందరికి ఈ మూవీ తెలుసు అన్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు చెప్పారా? అడగ్గా ఫైర్ అయ్యారు దర్శకుడు. వాళ్లకి చెప్పడం వల్ల, వాళ్లకి కథ తెలియడం వల్ల నీకు వచ్చే ఆనందం ఏంటి? అంటూ మండిపడ్డాడు.
ఎవరెవరి పర్మీషన్ల లెటర్లు కావాలి చెప్పు అంటూ ఫైర్ అయ్యారు. ఈ కథ వాళ్లకి తెలియడంలో నీ ఆనందం ఏంటి? నీ బాహ్య రూపం తెలిసింది. అంతరూపం ఏంటో చెప్పు అంటూ, నీకెందుకు తెలియాలి, నీకు ఇందులో ఉన్న ఉత్సుకత ఏంటి? అంతరంగం ఏంటి? అది ఈ సినిమాకు ఉపయోగపడుతుందా? అంటూ రెచ్చిపోయాడు. సినిమా చేసేవాడికి ఈ కథ తెలుసు అని, అది మీరు అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రెస్ మీట్ మొత్తం హీటెక్కిపోయింది. మరి నందమూరి ఫ్యామిలీ నాల్గో తరం ఎన్టీఆర్తో వైవీఎస్ చౌదరి ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తన ఎన్టీఆర్(న్యూ టాలెంట్ రోర్స్) పేరుతోనే బ్యానర్ని స్థాపించి ఈ మూవీని నిర్మిస్తున్నారు వైవీఎస్ చౌదరి. నందమూరి ఫ్యామిలీ నుంచి నాల్గోతరం వారసుడిని హీరోగా పరిచయం చేయడం తనకు దక్కిన అదృష్టం అని వెల్లడించారు. ఒక హీరో ఎన్టీఆర్ని సరైన సమయంలో సరైన విధంగా పరిచయం చేస్తానని, ఆయన హైట్, వెయిట్, పర్సనాలిటీ అద్భుతంగా ఉంటాడని, కళ్లు చాలా పెద్దగా ఉంటాయని, ముఖంలో తేజస్సు ఉంటుందని అందరిని ఆకట్టుకునేలా, ఆకర్షించేలా ఉంటాడని తెలిపారు వైవీఎస్ చౌదరి. హీరోతోపాటు హీరోయిన్ కూడా ఓ అకేషనల్గా పరిచయం చేస్తానని తెలిపారు.