వైరల్: వైఎస్ జగన్ను కలవనున్న బాలయ్య?
రాజకీయాల్లోనే కాదు సినీ రంగంలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది.
కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమ వివాదాలతో వేడెక్కుతోంది. కరోనా తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు సమావేశమయ్యారు. తరువాత వారంతా సీఎంతోనూ సమస్యల గురించి వివరించారు. అయితే ఈ చర్చలపై బాలకృష్ణ బహిరంగంగానే విమర్శలు చేశారు.
తనను ఆ మీటింగ్కు ఎవరూ ఆహ్వానించలేదని, ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వ పెద్దలతో కలిసి భూములు పంచుకుంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఒక్కసారి ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. ఒక రకంగా ఈ విషయంలో ఇండస్ట్రీ రెండుగా చీలిందన్న వాదనలు కూడా వినిపించాయి. బాలయ్యను పిలవకపోవటం తప్పని ఓ వర్గం వాదిస్తుంటే, మరో వర్గం ఎవరికి వారు వచ్చారే తప్ప స్పెషల్గా ఆహ్వానించలేదని వాదించారు.
ఈ సమయంలో నాగబాబు, నరేష్, సీ కళ్యాణ్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో చిరంజీవి నష్ట నివారణ చర్యలకు దిగినట్టుగా తెలుస్తోంది. అందుకే త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జరగబోయే చర్చలకు బాలకృష్ణను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ నెల 9న తెలుగు సినీ పెద్దలు ఏపీ సీఎంను కలవనున్నారు. ఈ చర్చలకు చిరంజీవితో పాటు బాలకృష్ణ కూడా హాజరు అవుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవటంతో నిజమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఒకవేళ నిజంగానే బాలయ్య చర్చలకు హాజరైతే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత బాలకృష్ణ, వైఎస్ జగన్ను కలవటం ఇదే తొలిసారి అవుతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కలిసినా ప్రత్యేకంగా మాట్లాడుకోవటం, ఎదురుపడి పలకరించుకోవటం ఇదే తొలిసారి అవుతుంది..
మరి చిరంజీవి నిజంగానే బాలయ్యను ఆహ్వానిస్తారా..? ఆహ్వానిస్తే బాలయ్య వెళతారా..? వైసీపీ అధినేతను కలుసుకునేందుకు బాలయ్య సుముఖత వ్యక్తం చేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.