గోదాదేవి కళ్యాణోత్సవ వేడుకలో చిరంజీవి దంపతులు.. రెండేళ్ల తర్వాత సందడి..
మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కృష్ణ జిల్లా డోకిపర్రులో గల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. బోగి పండుగ సందర్భంగా ఆయన శుక్రవారం సాయంత్రం డోకిపర్రులోని గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొని సందడి చేశారు.
బోగి పండుగ సందర్భంగా మార్నింగ్ తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపిన చిరంజీవి, ఆ తర్వాత రవితేజ కొత్త మూవీ `రావణాసుర` ఓపెనింగ్లో పాల్గొన్నారు. సాయంత్రం ఆయన సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రుకి వెళ్లారు. అక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఆలయ వర్గాలు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి.
గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది. అయితే రెండేళ్ల తర్వాత చిరంజీవి ఈ ఆలయానికి రావడం విశేషం. దీంతో అక్కడికి భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా చిరంజీవి హాట్ టాపిక్ అవుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్తో ఆయన గురువారం భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు చిత్ర పరిశ్రమ సమస్యలు, ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై చర్చించారు. అయితే మరో రెండు మూడు వారాల్లో అందరికి ఆమోదయోగ్యమైన ఫలితం వస్తుందని, అంతా మంచే జరుగుతుందని, సమస్యలన్నీ సెట్ అవుతాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే చిరంజీవి.. జగన్ని మీట్ అవ్వడం వెనకాల రాజకీయ కోణాలున్నాయనే రూమర్స్ లేచాయి. అన్ని మీడియా మాధ్యమాల్లో ఆయా వార్తలు చక్కర్లు కొట్టాయి. చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకి వెళ్లబోతున్నారనే టాక్ ఊపందుకోవడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఘాటుగా స్పందించారు. జగన్తో మీటింగ్ వెనకాలు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తాను రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా `గివ్ న్యూస్ నాట్ వ్యూస్` అంటూ ఆయన పంచుకున్న యాష్ ట్యాగ్ పెద్ద దుమారం రేపింది. దీనికి విజయ్ దేవరకొండ కూడా మద్దతు పలకడం విశేషం.
ప్రస్తుతం చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, `గాడ్ఫాదర్`, `భోళా శంకర్`, `మెగా 154` చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతోపాటు వెంకీ కుడుములతో మరో సినిమా చేయబోతున్నారు చిరు.