వివాదంలో అమితాబ్ ఇష్టమైన బంగ్లా.. కూల్చివేతకు బీఎంసీ ఆదేశాలు..
ఇంద్రభవనాన్ని తలపించే బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఇళ్లుని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూల్చేయబోతుంది. అక్రమంగా నిర్మించిన ఆ ఇంటిని కూల్చేయాలని కౌన్సిలర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
ముంబయిలోని జుహూలో గల అమితాబ్ బచ్చన్,జయ బచ్చన్ జంట ప్రేమతో కట్టించుకున్న ఇళ్లు `ప్రతీక్ష`. చూడ్డానికి ఇది ఇంద్రభవనంలా ఉంటుంది. బయటనుంచే వెళ్లే వారు కచ్చితంగా బిగ్బీ ఇంటిని చూసేవెళ్తారు. అదే సమయంలో చాలా మంది టూరిస్ట్ లు సైతం ఈ ఇంటిపై ఓ లుక్కేస్తారు. అంతగా ప్రాచూర్యం పొందిందీ `ప్రతీక్ష`. త్వరలోనే ఇది కూలబోబోతుంది.
బృహాన్ ముంబయి మున్సిపాలిటీ కార్పొరేషన్(బీఎంసీ) ఈ ఇంటిని కూల్చేయాలని ఇప్పటికే నోటీసులు కూడా పంపించింది. నాలుగేండ్ల క్రితమే దీన్ని కూల్చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ పనులు చేపట్టలేదు. దీంతో కాంగ్రెస్ నాయకుడు, లాయర్ తులిప్ బ్రియాన్ మరండా బిగ్బీ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని బీఎంసీని డిమాండ్ చేశారు.
2017లో రోడ్డు విస్తిర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసిందని, ఇప్పుడు ఆ నోటీసులపై వెంటనే చర్యలు చేసుకోవాల్సిందిగా బీఎంసీని కోరారు. కాగా ముంబై అమితాబ్ మొదటగా నిర్మించుకున్న బంగ్లా పేరు ప్రతీక్ష. దీని తర్వాత ఆయన జాల్సా అనే మరోక బంగ్లాను కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రతీక్ష రోడ్డు విస్తరణలో భాగమై ఉందని వెంటనే దానిని బీఎంసీ స్వాధీనం చేసుకుని కుల్చివేయాలంటూ మిరండా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, `అమితాబ్ బచ్చన్కు 2017లోనే ప్రతీక్ష అక్రమ నిర్మాణంలో ఉందంటూ బీఎంసీ నోటీసులు ఇచ్చింది. వీటిని రోడ్డు విస్తిర్ణంలో భాగంగా జారీ చేసింది. అయితే బీఎంసీ ఇప్పటి వరకు ఉదాసీనంగానే వ్యవహరించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. అదే ఓ సామాన్యుడికి చెందిన భూమి అయి ఉంటే బీఎంసీ ఇప్పటికే దానిని స్వాధీనం చేసుకుని ఉండేది. మున్సిపల్ చట్టం ప్రకారం భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు` అని ఆయన ప్రశ్నించారు.
అయితే అమితాబ్ మరికొందరూ తమ బంగ్లాలకు సంబంధించిన మెయిన్ మ్యాప్లలో మార్పులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కాగా కాంగ్రెస్ నేత మిరండా ఆరోపణల మేరకు బీఎంసీ కౌన్సిలర్ స్పందిస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే ఈ బంగ్లాలోని కొంత భాగమే రోడ్డు విస్తరణలో కూల్చేయనున్నారని సమాచారం. పూర్తిగా కాదని తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఈ ఇంటిలో అమితాబ్ ఉండటం లేదట. జుహూలోని కొత్తగా నిర్మించుకున్న `జల్సా` ఇంట్లో అమితాబ్ ఫ్యామిలీ ఉంటుందని సమాచారం.
మరోవైపు ఇటీవలే అమితాబ్ కొత్తగా మరో ఇంటిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. రూ.31కోట్లు పెట్టి క్రిస్టల్ గ్రూప్ అపార్ట్ మెంట్లో ఆయన కొత్త ఇంటిని కొన్నారు.
అమితాబ్ బచ్చన్ సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం `చెహ్ర్,`జుండ్`, `బ్రహ్మాస్త్ర`,`బట్టర్ఫ్లై`, `మేడే`,`గుడ్బై` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగులో ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రంలో నటించబోతున్నారు.