Balakrishna: `ఆదిత్య 999`పై బాలయ్య క్లారిటీ ఇదే.. వారికి రూ.50లక్షల ఆర్థిక సాయం
బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ `ఆదిత్య 999`పై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

ఆదిత్య 999పై బాలయ్య క్లారిటీ
బాలకృష్ణ చేయాలనుకుంటున్న ప్రతిష్టాత్మక మూవీ `ఆదిత్య 369` సీక్వెల్(ఆదిత్య 999). ఈ మూవీ రాబోతుందని గతంలో అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు బాలయ్య. ఇప్పుడు దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ చేయబోతున్నట్టు తెలిపారు. తాను ఇండియాలోనే తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ `ఆదిత్య 369` చేసినట్టు తెలిపారు. ఇప్పుడు దానికి ఈ సీక్వెల్ని చేయబోతున్నట్టు వెల్లడించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుకి చెందిన సత్కార కార్యక్రమంలో ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు బాలయ్య.
ఆదిత్య 369 సీక్వెల్లో మోక్షజ్ఞ తేజ
బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో `ఆదిత్య 369` మూవీ వచ్చింది. 1991లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. దీంతో ఎప్పటికైనా దీనికి సీక్వెల్ తీసుకురావాలని భావించారు బాలకృష్ణ. సింగీతం దర్శకత్వంలోనే ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏజ్ సహకరించడం లేదు. దీంతో క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ చేసే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు తానే ఈ మూవీకి దర్శకత్వం వహిస్తానని బాలయ్య తెలిపారు. కానీ ఇప్పుడు క్రిష్ చేతిలో ఈ ప్రాజెక్ట్ పెట్టినట్టు సమాచారం. ఇందులో మోక్షజ్ఞ తేజ కూడా కనిపించే అవకాశం ఉందని, ఓ కీలక పాత్రలో అతను కనిపిస్తారని సమాచారం. ఇదే ఆయన తొలి మూవీ కాబోతుందని కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ సీఎం నిధికి రూ.50లక్షల సాయం
ఇక తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలకు పలు జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. కొందరు ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రజలను అందుకునేందుకు ముందుకు వచ్చారు బాలయ్య. తెలంగాణ సీఎం నిధికి రూ.50లక్షలు విరాళం ప్రకటించారు. `ఇటీవల తెలంగాణలో వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో సహాయక చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాను` అని తెలిపారు బాలయ్య. ఒకప్పుడు నాన్న ఎన్టీఆర్ కూడా ఇలాంటి ఆపదలో విరాళాలు సేకరించి ప్రజలను ఆదుకున్నారని, తాను ప్రజలకు సహాయం అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటానని తెలిపారు బాలయ్య.
50ఏళ్లు పూర్తి చేసుకున్న బాలయ్యకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా యూకేకి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో బాలయ్యకి స్థానం కల్పించారు. దీనికి సంబంధించిన సత్కార ఈవెంట్ శనివారం హైదరాబాద్లో జరిగింది. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్, ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలకృష్ణకు అభినందనలు తెలిపారు.
జన్మజన్మల రుణపడి ఉంటాను
ఇందులో బాలకృష్ణ మాట్లాడుతూ, కోట్ల మంది అభిమానాన్ని పొందడం నా పూర్వ జన్మ సుకృతం, జన్మజన్మల రుణబంధం అని అనిపిస్తుంటుంది. సినిమా అనేది బలమైన మాధ్యమం. నా దర్శక, నిర్మాతల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. ఏపీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ, ఏపీలోనూ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. కళకి ఎప్పుడూ భాషా బేధం, లింగ బేధం ఉండదు. మన తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ఇది మన తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. ఈ రోజు నాకు ఇలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది` అని చెప్పారు.