తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం `రంగుల కళ`లో ఎన్నెన్ని కళలో..
`బాహుబలి` సినిమాతో తెలుగు సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. కానీ దాదాపు నాలభై ఏళ్ల క్రితమే బి.నర్సింగరావు రూపొందించిన `రంగుల కళ` చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. అన్ని వర్గాలచే ప్రశంసలందుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు అరుదైన చిత్రాలు వైరల్గా మారాయి.
బి.నర్సింగరావు తెలంగాణ సినిమాకి ఆద్యుల్లో ఒకరు. తెలంగాణ సమాజాన్ని, సాంస్కృతిక, సాంప్రదాయాలను, వృత్తులను, కళలను తన సినిమాల ద్వారా ఆవిష్కరించారు. అదే సమయంలో ఆనాటి అణచివేతను, దొరలు, పెత్తందార్లు, నైజాం అరాచకాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు.
సినిమా అనే కళ ద్వారా సమాజాన్ని చైతన్యం చేసే ప్రయత్నంచేశారు. `మా భూమి`, `రంగుల కళ`, `దాసి`, `మట్టి మనుషులు`, `హరివిల్లు` వంటి సినిమాల ద్వారా జనాన్ని చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ మట్టిని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆయన తీసింది తక్కువ సినిమాలే, కానీ ఆయా చిత్రాల ప్రభావం దేశం దాటి, ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది.
అందులో ఒకటి `రంగుల కళ`. స్వతహాగా పెయింటర్, ఆర్టిస్ట్ అయిన నర్సింగరావు.. ఈ చిత్రంలో ఓ గుర్తింపుకు నోచుకోని ఓ పెయింటర్ జీవిన చిత్రాన్ని ఆవిష్కరించారు. ఉన్నత వర్గాల వ్యతిరేకతకు గురైన పెయింటర్ పట్నం వచ్చి నగరంలో తాను చూసిన వాటిని, సంస్కృతిని, సాంప్రదాయాలను, ప్రజల జీవనాన్ని ఈ చిత్రంలో పెయింటింగ్ ద్వారా ఆవిష్కరించేవారు. ఓ రకంగా దీన్ని నర్సింగరావు ఆత్మకథగా చెబుతుంటారు.
కళకి సామజిక ప్రయోజనం ఉండాలనే మూల సిద్ధాంతాన్ని ఇందులో దర్శకుడు నరసింగరావు మన కండ్లకు కట్టినట్టుగా చూపించాడు. ఈ ఒక్క చిత్రం మాత్రమే కాదు... `దాసి`, `మాభూమి` వంటి చిత్రాల్లోనూ మనం ఈ దృక్పథాన్ని చూడవచ్చు. అందుకే కాబోలు అంతర్జాతీయ వేదికలపై కూడా ఈ చిత్రాలు ప్రదర్షింపబడ్డాయి.
`రంగుల కళ` చిత్రాన్ని బి.నర్సింగరావు దర్శకత్వం వహించడమే కాదు, నిర్మాతగా వ్యవహరించారు, పెయింటర్గా నటించారు. సాయిచంద్, గద్దర్లతో నటించి సినిమాకి, పెయింట్ పాత్రకి ప్రాణం పోశారు. గద్దర్ నటించడంతోపాటు `జమ్ జమల్ మర్రీ..`, `భద్రం కొడుకో.. `వంటి పాటలకు సంగీతం అందించడం, ఆలపించి సినిమాని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లారు.
ఈ చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొని 1983లో విడుదలైంది. అయితే సినిమాకి ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోయినా దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా గుర్తింపుని మాత్రం తెచ్చిపెట్టింది. ఇది ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుని అందుకుంది. అంతేకాదు 9వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్లివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శించబడి ప్రశంసలందుకుంది.
దీనిపై నర్సింగరావు అప్పట్లో స్పందిస్తూ, ఇదొక ప్రయోగంగా ఆయన వెల్లడించారు. కళకి ఇది అత్యున్నత రూపం అని, సంగీతం, పెయింటింగ్ వంటి రూపాలను ఆర్ట్ కలిగి ఉంటుందన్నారు. అదే సమయంలో బానిసత్వంపై ఇదొక తిరుగుబాటు అని వెల్లడించారు. ఆనాటి నగర జీవితాన్ని చూడాలంటే ఈ చిత్రాన్ని చూడొచ్చు అని తెలిపారు.