నా ప్రేమ, నా సర్వస్వం నువ్వే రాజా...వైరల్ అవుతున్న యాంకర్ సుమ ట్వీట్..!
స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తమ వివాహబంధానికి ముగింపు పలకనున్నారన్న వార్త సంచలనం రేపింది. వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకొని విడిపోనున్నారని మీడియాలో కథనాలు రావడం జరిగింది. కాగా ఈ విషయంపై స్పష్టత ఇస్తూ సుమ ఓ ట్వీట్ చేయగా వైరల్ గా మారింది.
యాంకర్ సుమ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ యాంకర్ గా దశాబ్దాలుగా బుల్లితెరను ఏలుతుంది. ఏ పెద్ద హీరో మూవీ ఫంక్షన్ అయినా, విశిష్ట సినీ వేడుక అయినా అక్కడ యాంకర్ గా సుమ దర్శనం ఇస్తుంది. వివిధ భాషలపై పట్టున్న సుమ వాక్చాతుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ లక్షణమే ఆమెను స్టార్ యాంకర్ ని చేసింది.
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సుమ చాల సినిమాలలో నటించారు. ఆ తరువాత సుమ యాంకర్ గా మారడం జరిగింది. మలయాళ అమ్మాయి అయిన సుమ తెలుగులో యాంకర్ గా ఫేమస్ అవడం విశేషం. ఈమెతో పాటు యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన వారు చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయారు.
1999లో సుమ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరి వివాహ బంధం మొదలై రెండు దశాబ్దాలు పూర్తి అయ్యింది. ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉండే ఈ కపుల్ కి భార్యాభర్తలుగా అన్యోన్యంగా ఉంటారనే పేరుంది.
సుమ రాజీవ్ కనకాల విడిపోతున్నారన్న వార్త టాలీవుడ్ లో సంచలనం రేపింది. సుమ మరియు రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థలు వచ్చాయని, రాజీవ్ కనకాలతో విసిగిపోయిన సుమ ఆయనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారని వార్తలు రావడం జరిగింది. అలాగే వీరిద్దరూ కొన్నిరోజులుగా వేరువేరుగా ఉంటున్నారన్న కథనాలు చక్కర్లు కొట్టాయి.
ఈ రూమర్స్ పై సుమ స్పందించారు. ఓ టీవీ కార్యక్రమం వేదికగా సుమ, రాజీవ్ కనకాలపై తనకున్న ప్రేమ తెలుపుతూ కన్నీరు పెట్టుకున్నారు. తాజాగా సుమ ఓ భావోద్వేగ ట్వీట్ ద్వారా వీరిద్దరి ప్రేమ గురించి తెలియజేసింది. ఆ ట్వీట్ లో 'ప్రియమైన రాజా, ఎప్పటికీ నువ్వే నా ప్రేమ, సర్వస్వం, ఆనందం' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.