- Home
- Entertainment
- అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
అయోధ్యలో భూమి కొనుగోలు కోసం అమితాబ్ బచ్చన్ రాత్రి 3 గంటలకు ఫోన్ చేశారని అభినందన్ లోధా వెల్లడించారు. ధర తెలుసుకున్న మరుసటి రోజే రూ.15 కోట్లు బదిలీ చేశారని చెప్పారు.

అయోధ్య భూమి కోసం రాత్రి 3 గంటలకు ఫోన్
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన సందర్భానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా వ్యవస్థాపకుడు, చైర్మన్ అభినందన్ లోధా వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2026లో మాట్లాడిన ఆయన, 2023లో తాను ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. రాత్రి 3 గంటలకు తన ఫోన్లో రెండు మిస్డ్ కాల్స్, అనంతరం "నేను అమితాబ్ బచ్చన్.. వీలైనప్పుడు తిరిగి కాల్ చేయండి" అనే సందేశం కనిపించిందని చెప్పారు. వెంటనే తిరిగి ఫోన్ చేసినప్పుడు, "నేను ఉత్తరప్రదేశ్కు చెందినవాడిని. అయోధ్యలో నాకు భూమి కొనుగోలు చేయాలని ఉంది" అని అమితాబ్ తనతో చెప్పినట్లు లోధా గుర్తు చేసుకున్నారు.
ధర చెప్పిన మరుసటి రోజే రూ.15 కోట్లు బదిలీ
ఆ సంభాషణలో మొదట అమితాబ్ భూమి ధర గురించి అడిగారని లోధా తెలిపారు. "మీతో ధర గురించి ఎలా మాట్లాడగలను?" అని తాను చెప్పగా, అమితాబ్ 15 వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారని చెప్పారు. దానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని తాను చెప్పిన వెంటనే, మరుసటి రోజే అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్లు బదిలీ చేశారని లోధా వెల్లడించారు. ఈ సంఘటనను ఆయన సమ్మిట్లో గుర్తు చేసుకుంటూ వివరించారు.
అయోధ్యలో అమితాబ్ భారీ స్కెచ్
అయోధ్యలో అమితాబ్ బచ్చన్ గత కొన్నేళ్లుగా తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులను క్రమంగా విస్తరిస్తున్నారు. 2026 మార్చిలో ఆయన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా నుంచి రూ.35 కోట్ల విలువైన 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సంస్థ వివరాల ప్రకారం, అయోధ్యలో ఇది ఆయన మూడో పెట్టుబడి కాగా, హెచ్ఓఏబీఎల్తో చేసిన నాలుగో ప్లాటెడ్ డెవలప్మెంట్ కొనుగోలు. ఈ భూమి సంస్థ చేపడుతున్న 75 ఎకరాల ది సరయూ ప్రాజెక్టుకు సమీపంలో ఉంది.
అయోధ్యలో భూమి సంపద మాత్రమే కాదు
ఆ పెట్టుబడి సందర్భంగా కూడా అభినందన్ లోధా స్పందించారు. "అమితాబ్ బచ్చన్ చేసిన పెట్టుబడి, భూమిని తరతరాలకు విలువను అందించే ఆస్తిగా చూసే ఉమ్మడి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు. "మా సంస్థలో భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తాం. అయోధ్యలో ఈ వారసత్వానికి మరింత ప్రత్యేకమైన అర్థం ఉంది. విశ్వాసం, వారసత్వం రెండూ కలిసే ప్రదేశంగా ఇది నిలుస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులతో అయోధ్య దీర్ఘకాలిక భూమి పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారుతోంది" అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.
అయోధ్యలో అమితాబ్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం
అంతకుముందు 2025 మేలో అమితాబ్ బచ్చన్ ది సరయూ ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని సుమారు రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే 2024లో హెచ్ఓఏబీఎల్ ప్రధాన మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ ది సరయూలోని 10 వేల చదరపు అడుగుల ప్లాట్ను రూ.14.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇలా వరుస పెట్టుబడులతో అయోధ్యలో అమితాబ్ బచ్చన్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించుకుంటూ వస్తున్నారు.

