- Home
- Entertainment
- Actress Vahini: తీవ్ర విషాదం, నటి వాహిని కన్నుమూత.. ప్రాణాంతక వ్యాధి చికిత్సకు డబ్బు లేకపోవడంతో మరణం
Actress Vahini: తీవ్ర విషాదం, నటి వాహిని కన్నుమూత.. ప్రాణాంతక వ్యాధి చికిత్సకు డబ్బు లేకపోవడంతో మరణం
ప్రముఖ బుల్లితెర నటి వాహిని మరణించారు. పిన్న వయసులోనే ఆమె మరణం అందరినీ విషాదంలో ముంచేసింది. తనకి ఉన్న ప్రాణాంతక వ్యాధి చికిత్సకి డబ్బు లేకపోవడం వల్ల వాహిని కన్నుమూశారు.

నటి వాహిని మరణం
ప్రముఖ సినీ బుల్లితెర నటి వాహిని అలియాస్ పద్మక్క (48) విషాదకర పరిస్థితుల్లో కన్ను మూశారు. నటి వాహిని ఎక్కువగా బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులని అలరించారు. కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. వాహిని మరణ వార్తతో ఆమె సన్నిహితులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వాహిని మరణం చాలా విషాదకర పరిస్థితుల్లో జరిగింది.
ఆ వ్యాధితో బాధపడుతున్న వాహిని
గత కొంతకాలంగా వాహిని రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు. అది విషమంగా మారడంతో వైద్యానికి అధిక మొత్తంలో డబ్బు అవసరం అయింది. వైద్యానికి అవసరమైన డబ్బు లేకపోవడం, ఇంతలో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రోజు వాహిని మరణించారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో ప్రకటించారు.
భావోద్వేగానికి గురైన నటి కరాటే కళ్యాణి
కరాటే కళ్యాణికి వాహినితో చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. విజయనగరంలో తన పెదనాన్న ఇంటి పక్కనే వాహిని ఇల్లు ఉండేది అని కరాటే కళ్యాణి పేర్కొంది. వాహిని మరణంతో కరాటే కళ్యాణి ఎంతో భావోద్వేగానికి గురవుతూ పోస్ట్ పెట్టారు. 'వాహిని (పద్మక్క) అక్కానిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తనజన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది.. మొన్న చెప్పేశారు ఇక కష్టం అని ఉరికి తీసుకువెళ్ళిపోయారు అంట.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను సద్గతి ఓం శాంతి. వి మిస్ యు. పద్మక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని కరాటే కళ్యాణి పోస్ట్ చేశారు.
విషమించిన ఆరోగ్యం
నటి వాహిని 1978లో విజయనగరంలో జన్మించారు. సినిమాల్లో, బుల్లితెరపై నటిగా గుర్తింపు పొందారు. కొంతకాలంగా వాహిని రొమ్ము క్యాన్సర్ తో బుధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. రొమ్ము క్యాన్సర్ ఎక్కువ కావడంతో ఆమె మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. దీనితో ఐసియులో ఉంచి వైద్యం అందించారు. కీమోథెరపీ, ఐసియు పర్యవేక్షణ కోసం వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి.
అంత ఖర్చు భరించలేక..
రూ.35 లక్షల వరకు డబ్బు ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలిపారు. ఆంత మొత్తం భరించే స్థితిలో ఆమె కుటుంబం లేదు. దీనితో పద్మక్క వైద్యానికి సాయం చేయాలి అని గతంలో కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా అభిమానులని, సినీ ప్రముఖుల్ని అడిగారు. కొంత మంది వారికి తోచిన విధంగా సాయం చేశారు. కానీ డబ్బు సరిపోలేదు. ఇంతలో వాహిని ఆరోగ్యం పూర్తిగా విషమంగా మారింది. ఇక కష్టం అని, ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు తేల్చేశారు. దీనితో ఆమె బుధవారం తన స్వస్థలం విజయనగరంలో మరణించారు. నటి వాహిని సీరియల్స్ తో పాటు నటుడు నరేష్ రఘుపతి వెంకయ్య నాయుడు అనే సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించారు.

