రియా ఎవరో తెలియదు.. తాప్సీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్లో బోల్డ్ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారుతున్న హాట్ బ్యూటీ తాప్సీ.. సుశాంత్ సింగ్రాజ్పుత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి విషయంలో షాకింగ్ కామెంట్ చేసింది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు ఇప్పుడు బాలీవుడ్లో పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో నెపోటిజానికి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. కంగనా రనౌత్ దీనిపై విమర్శలు గుప్పించగా, అందుకు తాప్సీ స్పందించింది.
దీంతో కొన్ని రోజులు తాప్సీకి, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కి మాటల యుద్దం జరిగింది. రియాకి వ్యతిరేకంగా, కరణ్జోహార్ వంటి వారికి వ్యతిరేకంగా కంగనా ఆరోపణలు చేశారు. కానీ తాప్సీ వారిని సమర్ధించారు. వారికి సపోర్ట్ గా మాట్లాడారు. దీంతో తాప్సీని కంగనా డీ గ్రేడ్ నటిగా పోలుస్తూ విమర్శించింది. అందుకు తాప్సీ కూడా ఘాటుగానే స్పందించింది.
తాజాగా సుశాంత్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకి తాప్సీ మద్దతు ప్రకటించింది. బాలీవుడ్ ప్రముఖులు, హీరోయిన్లు రియాకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా తాప్సీ సైతం ఆమెకి సపోర్ట్ గా నిలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది.
తాప్సీ మాట్లాడుతూ, రియా చక్రవర్తి ఎవరో నాకు తెలియదు. ఆమెని ఎప్పుడూ కలవలేదు. కానీ ఆమె పట్ల జరుగుతున్నది చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏకపక్షంగా అన్ని రకాలుగా ఆమెని టార్గెట్ చేయడం సరికాదని తాప్సీ తెలిపింది.
ఇంకా చెబుతూ, బాలీవుడ్కి సంబంధించిన చాలా మంది గతంలో ఏదో ఒక సమయంలో తప్పులు చేసే ఉంటారు. వారెవరూ రియా ఎదుర్కొంటున్న పరిస్థితిని ఫేస్ చేసి ఉండరు. మహిళగా రియాకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో `తాపడ్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన తాప్సీ ప్రస్తుతం `హసీన్ దిల్రుబా`, `జానగణమన`, అలాగే `రాకెట్ రష్మి`, `శెభాష్ మిథ్తు` చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.