- Home
- Entertainment
- సౌందర్య రియల్ యాటిట్యూడ్ బయటపెట్టిన నటుడు సురేష్.. ఆ ఘటన పంచుకుంటూ ఎమోషనల్.. నచ్చే క్వాలిటీ ఏంటంటే?
సౌందర్య రియల్ యాటిట్యూడ్ బయటపెట్టిన నటుడు సురేష్.. ఆ ఘటన పంచుకుంటూ ఎమోషనల్.. నచ్చే క్వాలిటీ ఏంటంటే?
తెలుగు తెర అద్భుతమైన నటి సౌందర్య ప్రవర్తనపై సీనియర్ నటుడు సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `అమ్మోరు`కి, `దేవిపుత్రుడు`కి ఆమెలో వచ్చిన మార్పుపై ఆయన ఓపెన్ అయ్యారు.

తెలుగు తెర సహజ నటి సౌందర్య. అందమైన రూపం, అద్బుతమైన నటన, అచ్చ తెలుగు అమ్మాయి అనే పదానికి అసలైన నిర్వచనం. కోట్ల మంది అభిమానులు ఆరాధించే గొప్ప నటి. ఆమె వెండితెరపై గోల్డెన్ ఎరని చూసింది. అంతలోనే అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. కానీ ఇప్పటికీ అదే రూపంలో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
సౌందర్య ప్రస్తావన వస్తే ఆమె నటన, అందం, ఉండే తీరు గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. నటిగా ఆమె సృష్టించిన సంచలనాలు ఎక్కువగా ప్రస్తావనకి వస్తాయి. అయితే ఆమె వ్యక్తిత్వం గురించి గొప్పగా చెబుతుంటారు. కానీ ఆమెని ప్రత్యక్షంగా చూసి, ఆమెతో సినిమాలతో జర్నీ చేసిన సీనియర్ నటుడు సురేష్ సౌందర్య వ్యక్తిత్వం, యాటిట్యూడ్ గురించి అసలైన విషయాలు వెల్లడించారు.
సీనియర్ నటుడు సురేష్ ఒకప్పుడు హీరోగా అనేక సినిమాలు చేసి మెప్పించారు. అలాగే ఇతర స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. నెగటివ్ రోల్స్ లోనూ అదరగొట్టారు. ఇటీవల సినిమాలకు బ్రేక్ వచ్చింది. చాలా కాలంగా ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన సినిమాలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సురేష్ మాట్లాడారు. ఇందులో సౌందర్య ప్రస్తావన వచ్చింది.
కన్నడ నటి అయిన సౌందర్య తెలుగులో నటించిన తొలి సినిమా `అమ్మోరు`. ఇందులో హీరో సురేష్. ఈ నేపథ్యంలో సౌందర్య మొదట్లో ఎలా ఉండేదో పంచుకున్నారు సురేష్. ఆమె ప్రవర్తన గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. కోడి రామకృష్ణ రూపొందించిన `అమ్మోరు` ఫీమేల్ లీడ్ కోసం దర్శకుడు సౌందర్యని ఎంపిక చేశారు. అప్పటికి ఆమెకి తెలుగు రాదు. దీంతో డైలాగులు పలకడం ఇబ్బందిగా ఉండేదట. ఆ విషయంలో సురేష్ సాయం కోరేదట.
ఆ సమయంలో ఎంతో అణకువగా ఉండేదని, చాలా సింపుల్గా ఉండేదని, కానీ నటనపై ఎంతో ప్యాషన్తో కనిపించేదని తెలిపారు. చాలా హార్డ్ వర్క్ చేసేదట. సినిమా అయిపోయేసరికి ఆమె తెలుగు బాగా నేర్చుకుందని తెలిపారు. అయితే సినిమా విడుదలయ్యే సరికి అప్పటికీ చాలా తెలుగు సినిమాలు విడుదలయ్యాయని, తన సినిమా ఆలస్యమైందని వెల్లడించారు. `అమ్మోరు` విడుదలయ్యే నటికి సౌందర్య తెలుగులో స్టార్ అయిపోయిందని వెల్లడించారు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి రెండు మూడు సినిమాలు చేశారట. చివరగా `దేవి పుత్రుడు` సినిమాలో నటించారు. దానికి కూడా కోడి రామకృష్ణ దర్శకుడు. వెంకటేష్ హీరో. `అమ్మోరు` సినిమా సమయంలో సౌందర్య యాటిట్యూడ్ ఎలా ఉందో, ఆ సినిమా సమయంలోనూ అలానే ఉందని, ఏమాత్రం మారలేదని, అదే మంచితనం, మర్యాద, ఆత్మీయత, అణకువతో ఉందని అదొక గ్రేట్ లక్షణమన్నారు సురేష్. ఎందుకంటే అంతటి స్టార్ డమ్ వస్తే ఆటోమెటిక్గా యాటిట్యూడ్ మారిపోతుందని, పెద్దగా పట్టించుకోరు, మనల్ని లెక్క చేయరు. కానీ మారకుండా ఉండటం చాలా కష్టం. సౌందర్య అది చేసి చూపించిందన్నారు.
సౌందర్యలో తనకు నచ్చినది ఆమె నవ్వు అని, నవ్వు చూస్తూ ముచ్చటేస్తుందని, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని, ఆమె నవ్వుకి తాను పెద్ద అభిమానని అని వెల్లడించారు. అయితే అంతటి అద్భుతమైన నటి, తనతో ఎంతో అనుబంధం ఉన్న నటి అలా హఠాన్మరణం చెందడంతో తాను తట్టుకోలేకపోయానని, కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిపారు సురేష్.
అంతేకాదు ఆ విషయం చెబుతూ, ఇంటర్వ్యూలోనూ ఆయన ఎమోషనల్ అయ్యారు. సౌందర్య 2004లో విమాన ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇదే కాదు నటుడు శ్రీహరి మరణం కూడా తనని ఎంతో కలచి వేసిందన్నారు. తక్కువ ఏజ్లోనే ఈ ఇద్దరు కన్నుమూశారని, వీరిద్దరు మరణించినప్పుడు తాను చాలా డిస్టర్బ్ అయిపోయానని తెలిపారు. వారి ఎప్పుడు గుర్తొచ్చినా చాలా ఎమోషనల్గా అనిపిస్తుందని వెల్లడించారు.