మరోవివాదంలో నటుడు పృథ్విరాజ్.. పొరపాటు జరిగింది, వివాదం పెద్దది చేయవద్దు
30ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో సూపర్ పాప్యులర్ అయిన నటుడు పృథ్వి రాజ్. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా పలు రకాల పాత్రలు చేశారు. దాదాపు ముప్పై ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్న పృథ్వి రాజ్ కొన్ని వివాదాలలో చిక్కుకున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ పార్టీలో చేరిన పృథ్విరాజ్, ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ విజయం సాధించడంతో నామినేటెడ్ పోస్ట్ దక్కించుకున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్విరాజ్ ని నియమించడం జరిగింది.
అయితే ఆయన పదవి చేప్పట్టిన కొన్నాళ్లకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారంటూ ఆడియో టేప్ బయటికి రావడం జరిగింది. ఈ విషయంలో తాను నిరపరాధిని అంటూ పృథ్విరాజ్ వెల్లడించారు. అలాగే కొందరు కుట్ర పూరితంగా వివాదంలో ఇరికించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడం కారణంగా, సినిమాలు అవకాశాలు కూడా కోల్పోయినట్లు వార్తలు రావడం జరిగింది.
తాజాగా పృథ్విరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఈ మధ్య టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. బుల్లితెర కామెడీ స్టార్స్ అయిన సుధీర్, హైపర్ ఆది వంటివారు చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో పాల్గొన్న పృథ్విరాజ్ కామెంట్స్ వివాదానికి దారితీశాయి.
ఆ కార్యక్రమంలో పృథ్విరాజ్ చేసిన కామెంట్స్, మరో నటుడు గౌతమ్ రాజ్ ని కించపరిచేవిగా ఉన్నాయని ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణలపై పృథ్విరాజ్ స్పందించారు.
ప్రసారమైన ఆ ప్రోగ్రాం నేను ఇంకా చూడలేదన్న పృథ్విరాజ్.. నటుడు గౌతమ్ రామ్ ని ఉద్దేశించి ఎటువంటి కామెంట్స్ చేయలేదు అన్నారు. నా మిత్రుడు గౌతమ్ రాజ్ ఒకరు ఉండగా తన గురించి ఆ వ్యాఖ్యలు చేశారు అన్నారు.
నటుడు గౌతమ్ రాజ్ చాలా కాలంగా తెలుసన్న పృథ్వి... అతను తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. అలాగే పొరపాటు జరిగింది, చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దని వీడియో సందేశంలో వేడుకున్నారు.