రోహిత్ శర్మ వల్లే నా కెరీర్ మొదలైంది, విరాట్ కోహ్లీ వల్ల... యజ్వేంద్ర చాహాల్ హాట్ కామెంట్...
సన్నగా బక్క పల్చగా ఉండే యజ్వేంద్ర చాహాల్, టీమిండియాలో స్టార్ స్పిన్నర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్టుల్లో చోటు దక్కకపోయినా వన్డే, టీ20 జట్లలో మాత్రం యజ్వేంద్ర చాహాల్ ప్లేస్ దాదాపు పర్మినెంట్. తాజాగా తన కెరీర్ ఎలా మొదలైందో ఎవరి వల్ల మొదలైందో చెప్పుకొచ్చాడు యజ్వేంద్ర చాహాల్..
‘రోహిత్ భయ్యాతో నాకున్న అనుబంధం చాలా స్పెషల్. కోహ్లీ నాకు మంచి ఫ్రెండ్, కానీ విరాట్ కంటే ముందే నాకు రోహిత్తో పరిచయం ఉంది. ఐపీఎల్ 2013 సీజన్లో రోహిత్ శర్మ కారణంగానే నాకు తొలిసారి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. నా ఐపీఎల్ ఎంట్రీకి కారణం అతనే.
2011 నుంచి 13 వరకూ నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. కేవలం రిజర్వు బెంచ్కే పరిమితమయ్యాను. ఇక నాకు అవకాశం రాదని ఫిక్స్ అయిపోతున్న సమయంలో రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు.
2013 సీజన్లో ఓ మ్యాచ్కి ముందు నా రూమ్కి వచ్చిన రోహిత్ శర్మ... ‘నువ్వు ఈ సీజన్లో మ్యాచులు ఆడబోతున్నావ్’ అని అన్నాడు. మొదట రోహిత్ శర్మ చెప్పిన మాటలు విని నేను నమ్మలేదు. ఎందుకంటే అప్పటికే ముంబై టీమ్లో హర్భజన్ సింగ్, ఓజా వంటి సీనియర్ స్పిన్నర్లు ఉన్నారు.
ముగ్గురు స్పిన్నర్లతో మ్యాచులు ఆడడం అంటే చాలా పెద్ద రిస్క్. అయితే రోహిత్ శర్మ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో నాకు పెద్దగా వికెట్లు దక్కలేదు. అయితే 2013 ఫైనల్లో నాపై నమ్మకం ఉంచి, తుదిజట్టులో చోటు కల్పించాడు.
రోహిత్ శర్మతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్. కుల్దీప్ యాదవ్తో కలిసి భారత జట్టుకి ఎన్నో విజయాలను అందించడం జీవితంలో మరిచిపోలేను. రోహిత్, కుల్దీప్ ఎప్పుడూ నాకు అండగా నిలిచారు.
రోహిత్ శర్మ నాకు అన్నయ్యలాంటివాడు. విరాట్ కోహ్లీతో అనుబంధం మాత్రం చాలా ప్రత్యేకం. కోహ్లీ చాలా ఫ్రెండ్లీ. విరాట్తో కంపెనీని చాలా ఎంజాయ్ చేస్తా....’ అంటూ చెప్పుకొచ్చాడు భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్.
2013 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆడిన యజ్వేంద్ర చాహాల్, ఆ మ్యాచ్లో 3 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే 2 వికెట్లు పడగొట్టి ముంబై ఇండియన్స్ తొలిసారి ఛాంపియన్గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఐపీఎల్ 2014 సీజన్ మినీ వేలంలో యజ్వేంద్ర చాహాల్ను బేస్ ప్రైజ్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. ఆర్సీబీ తరుపున ఆడిన మొదటి మ్యాచ్లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన చాహాల్, ఏడు సీజన్లుగా బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు.
‘ఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్ఫామెన్స్ బాగుంది. ఇప్పటికే మేం టాప్ 3లో ఉన్నాం. గత సీజన్లతో పోలిస్తే ఇప్పుడు జట్టులో పెద్దగా ఒత్తిడి కూడా లేదు. ఈజీగా ప్లేఆఫ్స్ చేరతామని అనుకుంటున్నా...
గ్లెన్ మ్యాక్స్వెల్ ఎంట్రీతో ఆర్సీబీలో మిడిల్ ఆర్డర్ సమస్య తీరిపోయింది. విరాట్తో పాటు ఏబీడీ కూడా చాలా ఫ్రీగా ఆడుతున్నారు. ఇదే జోరును కొనసాగించి టైటిల్ గెలవాలని భావిస్తున్నాం.’ అంటూ తెలిపాడు యజ్వేంద్ర చాహాల్...
2011 నుంచి 2013 వరకూ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన యజ్వేంద్ర చాహాల్, ఆర్సీబీ తరుపున 102 మ్యాచులు ఆడడం విశేషం. 103 మ్యాచుల్లో 125 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, తన ఫామ్ను ఇంకా రెండు సీజన్లు కొనసాగిస్తే టాప్ వికెట్ టేకర్ నిలిచే అవకాశం ఉంది.