మీ కంపెనీకి కోహ్లి బ్రాండ్ అంబాసిడర్.. నీ భార్యకు భరణం ఇచ్చేందుకు డబ్బుల్లేవంటే ఎలా..? : ఢిల్లీ కోర్టు
Virat Kohli: భారతదేశంలో బ్రాండ్లన్నీ టీమిండియా టెస్టు సారథి వెనకాలే. టీవీలలోనే గాక డిజిటల్ మీడియా లో కూడా కోహ్లి కింగే. విరాట్ ప్రమోట్ చేస్తున్నాడంటేనే అది భారీ కంపెనీ అయి ఉంటుందని అనుకుంటారు.. అలాంటిది...!!
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. అతడి క్రేజ్ చూసి దేశంలో టాప్ బ్రాండ్ లన్నీ అతడి వెనకాలే పడుతున్నాయి. బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కోహ్లి ఏడాదిలో వంద కోట్లకు పైనే సంపాదిస్తున్నాడు.
అయితే విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఓ సంస్థలో పనిచేసే డైరెక్టర్ ను ఇప్పుడు అదే కోహ్లి బ్రాండ్ తలనొప్పిగా మారింది. ఎందుకో తెలియాలంటే ఇది చదవాల్సిందే..
ఢిల్లీకి చెందిన ఓ వివాహిత.. తన భర్త, అతడి తల్లి కలిసి తనను హింసిస్తున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది. భర్తతో విడిపోయి తాను ఒంటరిగా ఉంటున్నది.
అయితే ఒంటరిగా, ఏ ఆదాయం లేకుండా ఉన్న తనకు తన భర్తతో భరణం ఇప్పించాలని.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన ట్రయల్ కోర్టు.. ఆమెకు నెలకు రూ. 30 వేల భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది.
ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ భర్త ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేశాడు. తనకు రూపాయి ఆదాయం లేదని, తానే చారిటీల మీద కాలం వెల్లదీస్తున్నానని, అలాంటిది తను నెలకు రూ. 30 వేలు ఎలా చెల్లించగలుగతానని కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఇద్దరి తరఫు వాదనలు విన్న న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అడిషినల్ సెషన్స్ జడ్జ్ అనూజ్ అగ్రవాల్ స్పందిస్తూ.. ‘మీ కంపెనీకి భారత టెస్టు క్రికెట్ సారథి విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అటువంటి కంపెనీకి మీరు డైరెక్టర్ గా ఉన్నారు. కోహ్లి ప్రమోట్ చేసే కంపెనీ నష్టాల్లో ఉందంటే నమ్మడానికి వీలుగా లేదు...’ అని వ్యాఖ్యానించారు.
దీంతో అవాక్కవడం సదరు భర్త వంతు అయింది. అతడు పెట్టుకున్న అప్పీల్ ను తిరస్కరించింది. ఇక ఆమె భార్య చెప్పిన దాని ప్రకారం..నిందితుడు లక్షాధికారి అని తెలుస్తున్నది. అతడికి నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాడని ఆమె వాపోతున్నది. అందులోనుంచే నెలకు రూ.30 వేలు భరణంగా ఇవ్వాలని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది.