రిజర్వు బెంచ్ కూడా ఇలా ఉందేంట్రా బాబు... ఎంట్రీతోనే అదరగొడుతున్న యంగ్ గన్స్...
దేశవాళీ క్రికెట్లో ఎంత మెరుగ్గా రాణించినా, అంతర్జాతీయ మ్యాచుల్లో ఆరంగ్రేటంతోనే రాణించడం అంత తేలిక కాదు. మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్నామనే ఫీలింగ్ కారణంగా తీవ్రఒత్తిడికి గురై, సరైన ప్రదర్శన ఇవ్వలేరు. కానీ ఐపీఎల్ కారణంగా సీన్ మారిపోయింది..
పార్థీవ్ పటేల్ నుంచి సంజూ శాంసన్ దాకా చాలామంది ఆరంభమ్యాచుల్లో సరిగ్గా రాణించలేక జట్టుకి దూరమైనవాళ్లే... అంతకుముందు సచిన్ టెండూల్కర్ నుంచి ధోనీ దాకా చాలామంది ప్లేయర్లు నిరూపించుకోవడానికి చాలా మ్యాచులు తీసుకున్నవారే...
అయితే ఐపీఎల్ కారణంగా కుర్రాళ్లలో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నామనే ఫీలింగ్, మానసిక ఒత్తిడి పూర్తిగా మాయమైనట్టే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన అందరూ అద్భుతంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుండడమే దీనికి ప్రధాన కారణం...
నవ్దీప్ సైనీ: ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు నవ్దీప్ సైనీ. అయితే గాయం కారణంగా నవ్దీప్ సైనీ ఆశించిన స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు.
మహ్మద్ సిరాజ్: ఆస్ట్రేలియా టూర్లో రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు మహ్మద్ సిరాజ్. మొదటి టెస్టులో ఆకట్టుకున్న సిరాజ్, కీలకమైన నాలుగో టెస్టులో ఐదు వికెట్లు తీసి ఆసీస్ ఓటమికి కారణమయ్యాడు. టెస్టు సిరీస్లో 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు సిరాజ్...
శుబ్మన్ గిల్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు శుబ్మన్ గిల్. మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదిన శుబ్మన్ గిల్, ఆస్ట్రేలియా టూర్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు...
నటరాజన్: ఆస్ట్రేలియాలో నవ్దీప్ సైనీ గాయపడడంతో ఎంట్రీ ఇచ్చిన నట్టూ, అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మూడో వన్డేలో ఆరంగ్రేటం చేసిన నటరాజన్ 2 వికెట్లు తీశాడు, టీ20 సిరీస్లో మంచి పర్ఫామెన్స్ చూపించాడు. నాలుగో టెస్టులో టెస్టు ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు...
అక్షర్ పటేల్: ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు అక్షర్ పటేల్. మూడు టెస్టుల్లో 24 వికెట్లు తీసి, ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు అక్షర్ పటేల్...
వాషింగ్టన్ సుందర్: ఆస్ట్రేలియా టూర్లో జరిగిన ఆఖరి టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. మొదటి మ్యాచ్లోనే 4 వికెట్లు తీసిన సుందర్, కీలక సమయంలో హాఫ్ సెంచరీతో శార్దూల్ ఠాకూర్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లాండ్ సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలు బాదాడు సుందర్...
ఇషాన్ కిషన్: ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో స్థానం సంపాదించుకున్నాడు ఇషాన్ కిషన్. బౌండరీతో అంతర్జాతీయ కెరీర్ ఖాతా తెరిచిన ఇషాన్ కిషన్, మెరుపు హాఫ్ సెంచరీ బాది అద్భుతమైన ఇన్నింగ్స్తో (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...
సూర్యకుమార్ యాదవ్: రెండో టీ20లో ఆరంగ్రేటం చేసినా, నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది సూర్యకుమార్ యాదవ్కి. ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాతి మ్యాచులోనూ 30+ పరుగులు చేసి అభిమానులను మెప్పించాడు...
రాహుల్ చాహార్: యజ్వేంద్ర చాహాల్ భారీగా పరుగులు సమర్పిస్తుండడంతో అతని స్థానంలో రాహుల్ చాహార్కి అవకాశం దక్కింది. దక్కిన అవకాశాన్ని చక్కగా వాడుకున్న చాహార్, మొదటి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాడు...
కృనాల్ పాండ్యా: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేతో వన్డే ఆరంగ్రేటం చేశాడు కృనాల్ పాండ్యా. మొదటి మ్యాచ్లోనే 26 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన కృనాల్ పాండ్యా, బౌలింగ్లోనూ ఓ వికెట్ తీసి రికార్డు క్రియేట్ చేశాడు...
ప్రసిద్ధ్ కృష్ణ: ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, మొదటి మూడు ఓవర్లలో 37 పరుగులిచ్చాడు. అయితే ఆ తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ, కీలకమైన వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్లో 4 వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు ప్రసిద్ధ్ కృష్ణ.
ఇలా ఎంట్రీ ఇచ్చిన ప్రతీ ప్లేయర్ అదరగొడుతుండడంతో టీమిండియా ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అవుతున్నారు. అయితే టీమిండియా సెలక్టర్లు మాత్రం తుదిజట్టు ఎంపికలో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు...