వృద్ధిమాన్ సాహాకి మరోసారి కరోనా పాజిటివ్... ఇంగ్లాండ్ టూర్ వెళ్లడం అనుమానమే...
భారత టెస్టు వికెట్ కీపర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకి మరోసారి కరోనా పాజిటివ్గా వచ్చింది. దీంతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్న సాహా, ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే ఫ్లైట్ ఎక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి...
మే 4న ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగాల్సిన రోజున వృద్ధిమాన్ సాహాకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ మ్యాచ్తో పాటు ఐపీఎల్ 2021 సీజన్ కూడా అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే...
10 రోజుల క్వారంటైన్, ఐసోలేషన్ తర్వాత వృద్దిమాన్ సాహాకి నిర్వహించిన కరోనా పరీక్షల్లో మరోసారి పాజిటివ్గా తేలింది. దీంతో అతను మరికొన్ని రోజుల ఐసోలేషన్లో గడపబోతున్నాడు...
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు సభ్యులు మే 19లోగా బయో బబుల్ జోన్లోకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది భారత క్రికెట్ బోర్డు...
19 నుంచి 25 వరకూ కఠినమైన క్వారంటైన్లో గడపబోతున్నారు భారత క్రికెటర్లు. ఆ తర్వాత జూన్ 2న ఛార్టెడ్ ఫ్లైట్ ద్వారా ఇంగ్లాండ్కి చేరుకుంటారు.
ఇంగ్లాండ్కి వెళ్లే ఛార్టెడ్ ఫ్లైట్ ఎక్కేలోపు ఏ ప్లేయర్ అయినా కరోనా పాజిటివ్గా తేలితే, అతన్ని సిరీస్ నుంచి తొలగిస్తామని... ఛార్టెడ్ ఫ్లైట్ ఎక్కేలోపు ఏ ప్లేయర్ కూడా కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే జట్టుతో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా, మరో ఐదు రోజుల్లోపు పూర్తిగా కోలుకోవాల్సి ఉంటుంది...
లేకపోతే అతను లేకుండానే ఇంగ్లాండ్ టూర్కి బయలుదేరుతుంది టీమిండియా. వృద్ధిమాన్ సాహా లేకపోతే వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఒక్కడే ఉంటాడు. రిషబ్ పంత్ గాయపడితే మరో ప్రత్యామ్నాయ కీపర్ అందుబాటులో ఉండడు.
కెఎల్ రాహుల్తో పాటు వృద్దిమాన్ సాహాను వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్ టూర్కి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఈ ఇద్దరూ క్వారంటైన్ ప్రారంభమయ్యేలోపు ఫిట్నెస్ నిరూపించుకోవాలని తెలిపారు.
ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన కెఎల్ రాహుల్కి అపెండిక్స్ సర్జరీ నిర్వహించారు వైద్యులు. సర్జరీ తర్వాత వారం రోజుల్లో క్రికెట్ ఆడొచ్చని తెలిపినా, కెఎల్ రాహుల్ ఫిట్నెస్పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు.