వరల్డ్ కప్ ఫైనల్పై నీలి మేఘాలు.? మ్యాచ్ జరగకపోతే ట్రోఫీ ఎవరికీ ఇస్తారు.?
Womens world cup final: మహిళల వరల్డ్ కప్పై అందరి దృష్టి పడింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఈసారి కప్ మనదే అని ఇండియన్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. అయితే ఓ వార్త ఇప్పుడు క్రికెట్ ప్రియులను హడలెత్తిస్తోంది.

ఫైనల్ మ్యాచ్పై ఉత్కంఠ
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 చివరి పోరు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత్ మహిళల జట్టు, సౌతాఫ్రికా జట్టు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. కానీ ఈ చారిత్రక మ్యాచ్కు వాతావరణం పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఎల్లో అలర్ట్ జారీ చేసినందున ఆదివారం ఫైనల్ రోజు, అలాగే రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వర్షం కురిసే సూచనలు ఉన్నాయి.
కొత్త ఛాంపియన్ ఖాయం
ఇప్పటి వరకూ మహిళల వన్డే ప్రపంచకప్ను భారత్, సౌతాఫ్రికా ఎవరూ గెలుచుకోలేదు. భారత్ మూడోసారి ఫైనల్కు చేరగా, సౌతాఫ్రికా తొలిసారి ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం ఏదైనా సరే, మహిళల ప్రపంచకప్ చరిత్రలో కొత్త అధ్యయనానికి తెర లేవనుంది.
సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన
డీవై పాటిల్ స్టేడియంలోనే జరిగిన సెమీఫైనల్లో జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు చేసి భారత్ను విజయతీరాలకు చేర్చింది. ఏడు సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. మరోవైపు సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరింది. ఇరుజట్లూ అద్భుత ఫామ్లో ఉన్నందున అభిమానులు ఈ పోరు కోసం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.
ఆందోళన కలిగిస్తున్న వాతావరణ అంచనాలు
వాతావరణ శాఖ ప్రకారం నవంబర్ 2న జరగనున్న ఫైనల్ రోజున సాయంత్రం 4 గంటల తర్వాత 50 శాతం వర్ష సూచన ఉంది. అలాగే సోమవారం రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడే అవకాశం ఉంది. గతంలో ఇదే స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన ఘటన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
రిజర్వ్ డే కూడా రద్దయితే ఏమవుతుంది?
ఐసీసీ నియమాల ప్రకారం ఫైనల్ మ్యాచ్ పూర్తికావడానికి రిజర్వ్ డే కేటాయించారు. ఆదివారం వర్షం కారణంగా ఆట ఆగితే, సోమవారం అక్కడి నుంచి కొనసాగుతుంది. అయితే రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ పూర్తి కాకపోతే, లేదా కనీస ఓవర్లు ఆడే పరిస్థితి లేకపోతే, రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అంటే, భారత్ మహిళా జట్టు, సౌతాఫ్రికా మహిళా జట్టు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటాయి.